న్యూఢిల్లీ: ప్రేమ, మనస్పర్థలు, జైలు శిక్ష.. ఆపై అనూహ్య మలుపులతో సాగిన ఒక విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాన్ని (ఆర్టికల్ 142) ఉపయోగించి, ఒక వ్యక్తిపై నమోదైన పోక్సో (POCSO) కేసును, అతనికి పడిన పదేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. బాధితురాలు మేజర్గా మారిన తర్వాత సదరు నిందితుడినే వివాహం చేసుకుని సంసారం సాగిస్తుండటాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.
అసలేం జరిగింది?

బాధిత మహిళ, నిందితుడు ఇద్దరూ ఇంటర్మీడియట్ (12వ తరగతి) చదువుకునే రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అయితే, ఆ తర్వాత సదరు యువకుడు పెళ్లికి నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన సమయంలో ఆమె మైనర్ కావడంతో, పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు సదరు యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
జీవితంలో అనూహ్య మలుపులు
శిక్ష పడిన తర్వాత సదరు యువతికి వేరొకరితో వివాహమైంది. కానీ, ఆమె గతానికి సంబంధించిన విషయం తెలియడంతో పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె భర్త వదిలేశాడు. మరోవైపు, బెయిల్పై బయటకు వచ్చిన మొదటి ప్రియుడు (నిందితుడు) మళ్లీ ఆమెను కలిశాడు. ఇద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.
హైకోర్టు తిరస్కరణ.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం
పెళ్లి తర్వాత తమ సంసార జీవితానికి ఈ పాత కేసు అడ్డురాకూడదని భావించిన సదరు మహిళ, తన భర్తకు పడిన శిక్షను రద్దు చేయాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పోక్సో చట్టం కింద నమోదైన తీవ్రమైన నేరాల్లో ఇలాంటి రద్దు సాధ్యం కాదంటూ హైకోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సంపూర్ణ న్యాయం కోసం 'ఆర్టికల్ 142'
ఈ కేసును విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దంపతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను బట్టి దంపతులిద్దరూ సమాజంలో భార్యాభర్తలుగా ప్రశాంతంగా జీవించే హక్కును కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
{{/usCountry}}ఈ కేసును విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దంపతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను బట్టి దంపతులిద్దరూ సమాజంలో భార్యాభర్తలుగా ప్రశాంతంగా జీవించే హక్కును కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
{{/usCountry}}"కేసులోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం లభించిన సంపూర్ణ అధికారాలను ఉపయోగించి నిందితుడిపై ఉన్న పోక్సో శిక్షను రద్దు చేస్తున్నాం. అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాం" అని ధర్మాసనం పేర్కొంది.
అయితే, ఈ తీర్పును కేవలం ఈ కేసులోని విలక్షణమైన పరిస్థితుల ఆధారంగానే ఇచ్చామని, దీనిని ఇతర కేసులకు ఉదాహరణగా (Precedent) తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.