సుజుకి నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access వచ్చేసింది: ధర, ఫీచర్లు ఇవే
సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'e-Access'ను రూ. 1,88,490 ధరతో విడుదల చేసింది. 95 కి.మీ రేంజ్, అదిరిపోయే వారంటీ ఆఫర్లతో వస్తున్న ఈ స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
భారత టూ-వీలర్ మార్కెట్లో తిరుగులేని ముద్ర వేసిన జపాన్ దిగ్గజం సుజుకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) రేసులోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన పాపులర్ మోడల్ 'యాక్సెస్'ను ఎలక్ట్రిక్ రూపంలో 'e-Access' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరను రూ. 1,88,490 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. గతేడాది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మోడల్, ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

మీరు కొత్తగా సుజుకి e-Access కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన టాప్ 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి.
1. ధర, బుకింగ్ వివరాలు
సుజుకి e-Access ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1,88,490 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ కొనాలనుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత సుజుకి డీలర్షిప్ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆఫ్లైన్ డీలర్లతో పాటు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ (Flipkart) ద్వారా కూడా ఈ స్కూటర్ను కొనుగోలు చేసే వెసులుబాటును సుజుకి కల్పించింది.
2. అదిరిపోయే ఆఫర్లు.. బంపర్ వారంటీ!
వినియోగదారులను ఆకర్షించేందుకు సుజుకి భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకాన్ని పెంచేలా ఏకంగా 7 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీని అదనపు ఖర్చు లేకుండానే అందిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఆఫర్లు ఇవే:
బై-బ్యాక్ హామీ: కొన్న మూడు ఏళ్ల తర్వాత స్కూటర్ అసలు ధరలో 60% వరకు తిరిగి ఇచ్చేలా బై-బ్యాక్ అష్యూరెన్స్ ఇస్తోంది.
లాయల్టీ బోనస్: పాత సుజుకి కస్టమర్లకు రూ. 10,000 వరకు, కొత్త కస్టమర్లకు రూ. 7,000 వరకు వెల్కమ్ బోనస్ లభిస్తుంది.
ఫైనాన్స్ సౌకర్యం: 5.99% తక్కువ వడ్డీ రేటుతో లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
3. స్టైలిష్ రంగులు.. సరికొత్త లుక్
ఈ స్కూటర్ మొత్తం నాలుగు రకాల డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- మెటాలిక్ మ్యాట్ బ్లాక్ విత్ మెటాలిక్ మ్యాట్ బోర్డియక్స్ రెడ్.
- పెర్ల్ గ్రేస్ వైట్ విత్ మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ గ్రే.
- పెర్ల్ జేడ్ గ్రీన్ విత్ మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ గ్రే.
సరికొత్తగా మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ విత్ మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ గ్రే అనే రంగును కంపెనీ పరిచయం చేసింది.
4. బ్యాటరీ సామర్థ్యం, పర్ఫార్మెన్స్
సుజుకి e-Access లో 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించారు.
రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
వేగం: గంటకు 71 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
ఛార్జింగ్: సాధారణ ఛార్జర్తో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 2 గంటల 12 నిమిషాల్లోనే ఛార్జింగ్ పూర్తవుతుంది.
రైడ్ మోడ్స్: ఇందులో ఎకో (Eco), రైడ్ A (Ride A), రైడ్ B (Ride B) అనే మూడు మోడ్లతో పాటు రివర్స్ మోడ్ కూడా ఉంది. బ్యాటరీ కేవలం 10% ఉన్నా కూడా స్కూటర్ పర్ఫార్మెన్స్లో మార్పు ఉండదని కంపెనీ చెబుతోంది.
5. మెయింటెనెన్స్
ఈ స్కూటర్ ను తేలికపాటి ఛాసిస్పై నిర్మించారు, ఇది ప్రయాణంలో మంచి స్థిరత్వాన్ని (Stability) ఇస్తుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఇందులో మెయింటెనెన్స్-ఫ్రీ డ్రైవ్ బెల్ట్ను వాడారు. దీని కాలపరిమితి ఏకంగా 7 ఏళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని సుజుకి హామీ ఇస్తోంది. ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ దీనికి మరింత ప్రీమియం లుక్ను ఇస్తున్నాయి.
| Suzuki e-Access: పవర్ ట్రైన్, స్పెసికేషన్స్ | |
|---|---|
| బ్యాటరీ | 3.07 kWh Lithium Iron Phosphate (LIP) |
| పవర్ | 5.49 bhp |
| టార్క్ | 15 Nm |
| రేంజ్ | 95 km/charge |
| టాప్ స్పీడ్ | 71 kmph |
| రెగ్యులర్ చార్జింగ్ టైమ్ | 6 hours 42 minutes |
| ఫాస్ట్ ఛార్జింగ్ టైమ్ | 2 hours 12 minutes |
| రైడ్ మోడ్స్ | Eco, Ride A, Ride B, Reverse mode |
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


