తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్.ఎన్. రవి వాకౌట్.. అసలేం జరిగింది?
తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ఆర్.ఎన్. రవి, ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంగళవారం (జనవరి 20) అసెంబ్లీ మొదటి రోజు సమావేశాల్లో గవర్నర్ తన ప్రసంగాన్ని చదవకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించారని, తన మైక్ కట్ చేశారని గవర్నర్ ఆరోపించారు.
తమిళనాడు రాజకీయాల్లో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏటా మొదటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. అయితే, గవర్నర్ ఆర్.ఎన్. రవి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వరుసగా మూడో ఏడాది కూడా ఆయన ఇలా ప్రసంగాన్ని బహిష్కరించడం గమనార్హం.

సభలో అసలేం జరిగింది?
ఉదయం 9:30 గంటలకు సభ ప్రారంభం కాగానే, స్పీకర్ ఎం. అప్పావు గవర్నర్ను ఉద్దేశించి.. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదవాలని, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు. దీనిపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
"నా ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వడం లేదు. నా మైక్ను కూడా పదే పదే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు" అని గవర్నర్ సభలోనే ఆరోపించారు. ఆ వెంటనే ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే సభ నుంచి నిష్క్రమించారు.
రాజ్ భవన్ (లోక్ భవన్) వివరణ:
గవర్నర్ వాకౌట్ చేసిన కొద్దిసేపటికే ఆయన కార్యాలయం ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. అందులో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసింది:
అబద్ధపు ప్రచారం: ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠంలో వాస్తవ విరుద్ధమైన, తప్పుదోవ పట్టించే అంశాలు ఉన్నాయని రాజ్ భవన్ పేర్కొంది.
పెట్టుబడులపై సందేహం: రాష్ట్రానికి ₹12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని, అనేక ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించింది.
నేరాలు-ఆత్మహత్యలు: రాష్ట్రంలో మహిళలపై నేరాలు, పోక్సో (POCSO) కేసులు విపరీతంగా పెరిగాయని.. తమిళనాడు 'ఆత్మహత్యల రాజధాని'గా మారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది.
జాతీయ గీతం వివాదం: సెషన్ ప్రారంభంలో రాష్ట్ర గీతం (తమిళ తాయి వాజ్తు) పాడుతున్నారని, జాతీయ గీతాన్ని విస్మరించి రాజ్యాంగ విధులను అవమానిస్తున్నారని గవర్నర్ కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం స్పందన:
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గవర్నర్ తీరును తీవ్రంగా ఖండించారు. శాసనసభ సంప్రదాయాలను గవర్నర్ గౌరవించడం లేదని మండిపడ్డారు. "మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ అనవసరం" అని గతంలో డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై చెప్పిన మాటలను సీఎం గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగించకపోయినా, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని సభ రికార్డుల్లోకి ఎక్కించేలా స్టాలిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
గత మూడు ఏళ్లుగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య జాతీయ గీతం ప్రొటోకాల్, ప్రసంగ అంశాలపై ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల సమయం ఉన్న తరుణంలో ఈ గొడవ మరింత రాజకీయ వేడిని రాజేసింది.

E-Paper












