...
...
Next Story

బంగ్లాదేశ్ ప్రధాని రేసు: 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిక్ రెహ్మాన్

సుదీర్ఘ కాలం పాటు ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహ్మాన్ గురువారం స్వదేశానికి చేరుకున్నారు. 17 ఏళ్ల తర్వాత ఆయన రాకతో దేశ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా బరిలోకి దిగుతున్నారు.

Published on: Dec 25, 2025, 14:03:34 IST
Advertisement

బంగ్లాదేశ్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగిన తారిక్ రెహ్మాన్, దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రవాసం తర్వాత మాతృభూమికి చేరుకున్నారు. లండన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం వెలుపల నేలను తాకి నమస్కరించిన తారిక్, నేరుగా 300 అడుగుల రహదారి (300 Feet Road) వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలివెళ్లారు.

ఎవరు ఈ తారిక్ రెహ్మాన్?

బంగ్లాదేశ్ ప్రధాని రేసు: 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిక్ రెహ్మాన్ (AFP)
బంగ్లాదేశ్ ప్రధాని రేసు: 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిక్ రెహ్మాన్ (AFP)

బంగ్లాదేశ్ రాజకీయాల్లో దిగ్గజ కుటుంబానికి వారసుడు తారిక్ రెహ్మాన్.

వారసత్వం: బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియార్ రెహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల పెద్ద కుమారుడు.

పదవి: ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP)కి తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రవాసం: రాజకీయ కారణాలు, పలు కేసుల నేపథ్యంలో ఆయన గత 17 ఏళ్లుగా లండన్‌లో ప్రవాస జీవితం గడిపారు.

ఈ రాక ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది?

తారిక్ రెహ్మాన్ రాక బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది.

ఎన్నికల బరిలో: 2026 ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తాజా సర్వేల ప్రకారం (IRI సర్వే), ఈ ఎన్నికల్లో బీఎన్‌పీ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. తారిక్ రాక పార్టీ కార్యకర్తల్లో కొత్త ఊపిరి పోసింది.

హసీనా పతనం తర్వాత: సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న షేక్ హసీనా 2024 విద్యార్థి ఉద్యమం నేపథ్యంలో పదవీచ్యుతురాలై దేశం విడిచి వెళ్లిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని తారిక్ భర్తీ చేయాలని చూస్తున్నారు.

వ్యక్తిగత కారణాలు: తన తల్లి ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో ఉండటం కూడా ఆయన త్వరగా స్వదేశానికి రావడానికి ఒక కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తారిక్ రెహ్మాన్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు?

2007లో బంగ్లాదేశ్‌లో సైనిక మద్దతుతో ఆపద్ధర్మ ప్రభుత్వం (Caretaker Government) అధికారంలో ఉప్పుడు, అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగా తారిక్ రెహ్మాన్‌ను అరెస్టు చేశారు. కస్టడీలో ఉన్న సమయంలో ఆయనపై భౌతిక దాడులు, చిత్రహింసలు జరిగాయని, దీనివల్ల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు.

2. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం

2008 సెప్టెంబర్ 11న, వెన్నుముక సమస్యలకు మెరుగైన చికిత్స పొందేందుకు ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆ సమయంలోనే ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, మెడికల్ వీసాపై లండన్ వెళ్లారు.

3. తీవ్రమైన నేరారోపణలు, శిక్షలు

ఆయన లండన్‌లో ఉన్న సమయంలో, షేక్ హసీనా ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు నమోదు చేసింది. వాటిలో ముఖ్యమైనవి:

2004 గ్రెనేడ్ దాడి కేసు: అప్పటి ప్రతిపక్ష నేత షేక్ హసీనాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో తారిక్ రెహ్మాన్ మాస్టర్ మైండ్‌గా ఉన్నారని ఆరోపిస్తూ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.

మనీ లాండరింగ్, అవినీతి: సింగపూర్‌కు అక్రమంగా డబ్బు తరలించిన కేసులో ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది.

జియా ఛారిటబుల్ ట్రస్ట్ కేసు: నిధుల దుర్వినియోగం కేసులో కూడా ఆయనకు శిక్ష పడింది.

4. రాజకీయ వేధింపుల ఆరోపణ

ఈ శిక్షలన్నీ రాజకీయ ప్రేరేపితమని, షేక్ హసీనా ప్రభుత్వం తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టిందని తారిక్ రెహ్మాన్ వాదిస్తూ వచ్చారు. అందుకే ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగి రాకుండా లండన్‌లోనే ఉండిపోయారు.

తాజా పరిణామం

2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత, బంగ్లాదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు తారిక్ రెహ్మాన్‌ను అన్ని ప్రధాన కేసుల నుండి (గ్రెనేడ్ దాడి, మనీ లాండరింగ్ సహా) నిర్దోషిగా విడుదల చేశాయి. ఈ న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, 17 ఏళ్ల తర్వాత ఆయన 2025 డిసెంబర్ 25న తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టారు.

భద్రతా సవాళ్లు, బాంబు పేలుడు

తారిక్ రెహ్మాన్ రాకకు ఒక రోజు ముందు ఢాకాలోని మొఘ్‌బజార్ ప్రాంతంలో నాటు బాంబు పేలి ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఒక ఫ్లైఓవర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు విసిరిన బాంబు కారణంగా రోడ్డు పక్కన టీ తాగుతున్న వ్యక్తి మరణించాడు. దీంతో ప్రభుత్వం, పోలీసులు ఢాకా అంతటా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 50 లక్షల మంది మద్దతుదారులతో భారీ ప్రదర్శన నిర్వహించాలని బీఎన్‌పీ లక్ష్యంగా పెట్టుకుంది.

బంగ్లాదేశ్ ప్రస్తుతం డాక్టర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉంది. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు ఆ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe