శ్రేయస్ అయ్యర్ ఫిట్.. వన్డేల్లో మళ్లీ నాలుగో స్థానంలోనే.. గాయంతో టీ20 టీమ్ నుంచి తిలక్ వర్మ ఔట్!
టీమిండియాకు ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ ఒకేసారి వచ్చాయి. వన్డే టీమ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించగా.. మరో స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడి టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డాడు.
న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఒక శుభవార్త, ఒక చేదు వార్త అందాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించి రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. కానీ టీ20 స్పెషలిస్ట్, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గాయం బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాబోయే టీ20 వరల్డ్ కప్లో తిలక్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

శ్రేయస్ అయ్యర్ విధ్వంసం..
విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టి శ్రేయస్ అయ్యర్ ఫామ్లోకి రాగా.. తిలక్ వర్మ సర్జరీ బాట పట్టేలా కనిపిస్తున్నాడు. ఈ ఇద్దరు క్రికెటర్ల గాయాలు, ఫిట్నెస్ వివరాలు ఇక్కడ చూడండి. సిడ్నీలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో గాయపడిన శ్రేయస్ అయ్యర్.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ బ్యాట్ పట్టాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం అయ్యర్ ఫిట్నెస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిట్నెస్ నిరూపించుకోవడానికి విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన అయ్యర్.. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తను ఏ రేంజ్ ఫామ్లో ఉన్నాడో చాటిచెప్పాడు.
శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మారనుంది. 4వ స్థానంలో అయ్యర్ ఆడనుండగా, మెడ గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తుది జట్టులోకి రానున్నాడు. దీంతో యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది.
తిలక్ వర్మకు గాయం.. వరల్డ్ కప్ ఆడతాడా?
గత ఏడాది కాలంగా టీ20ల్లో ఇండియాకు నమ్మదగ్గ మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఎదిగిన తిలక్ వర్మ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడుతుండగా తిలక్ పొట్ట భాగంలో నొప్పిని ఎదుర్కొన్నాడు.
బెంగళూరు వైద్య బృందం తిలక్కు సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. అదే జరిగితే అతను కోలుకోవడానికి 3 నుంచి 4 వారాలు పడుతుంది. న్యూజిలాండ్ సిరీస్ ఎలాగూ మిస్ అవుతాడు. కానీ ఫిబ్రవరి 7న అమెరికాతో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ నాటికి అతను కోలుకుంటాడా లేదా అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ తిలక్ దూరమైతే.. సెలెక్టర్లు మళ్ళీ రియాన్ పరాగ్, శుభ్మన్ గిల్ లేదా అయ్యర్ వైపు చూసే అవకాశం ఉంది. గత ఆసియా కప్లో పాకిస్థాన్పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ లేకపోవడం ఇండియాకు కచ్చితంగా లోటే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


