US Iran peace talks : ‘బ్యాడ్ న్యూస్’.. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం! ఇక యుద్ధం ఎటువైపు?
Islamabad talks : అమెరికా- ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి! అణు కార్యక్రమాలపై ఇరాన్ మొండివైఖరి వీడకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని అమెరికా ప్రకటించగా, ఆ దేశ డిమాండ్లు సహేతుకంగా లేవని ఇరాన్ మండిపడింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన చర్చలు విఫలమయ్యాయి! దాదాపు 21 గంటల పాటు సాగిన మారథాన్ చర్చల అనంతరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ఇస్లామాబాద్ నుంచి వెనుదిరిగారు. చర్చలు ఫలించలేదని, ఈ పరిణామం అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు : అణు అస్త్రమే ప్రధాన అడ్డంకి!
చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించడమేనని వాన్స్ స్పష్టం చేశారు. అమెరికా జెండాల మధ్య నిలబడి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా రెడ్ లైన్స్ (నియమ నిబంధనలు) ఏంటో మేము స్పష్టంగా చెప్పాం. కానీ మా షరతులను అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. అణు ఆయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన పరికరాలను సేకరించబోమని ఇరాన్ దీర్ఘకాలిక హామీ ఇవ్వాలని మేము కోరాము. అదే అధ్యక్షుడు ట్రంప్ ప్రధాన లక్ష్యం," అని వివరించారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో, గతేడాది జరిగిన దాడుల్లో ఇరాన్కు చెందిన అనేక అణు కేంద్రాలను అమెరికా, ఇశ్రాయేల్ ధ్వంసం చేసిన విషయాన్ని వాన్స్ గుర్తుచేశారు. భౌతిక విధ్వంసం కంటే రాజకీయ నిబద్ధతే శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరాన్ ఆగ్రహం: 'అమెరికా డిమాండ్లు సహేతుకం కాదు'
మరోవైపు, అమెరికా, అసంబద్ధమైన డిమాండ్ల వల్లే చర్చలు ప్రతిష్టంభనకు గురయ్యాయని ఇరాన్ అధికారిక మీడియాప్రకటించింది. ఇరాన్ ప్రజల ప్రయోజనాల కోసం 21 గంటల పాటు తీవ్రంగా కృషి చేశామని, కానీ అమెరికా మొండితనం వల్ల పురోగతి లేకపోయిందని టెలిగ్రామ్ వేదికగా పేర్కొంది.
అమెరికా '15 పాయింట్లు'.. ఇరాన్ '10 పాయింట్లు'
ఈ చర్చల్లో అమెరికా 15 అంశాలతో కూడిన ప్రతిపాదనను ఉంచింది. ఇందులో అణు కార్యక్రమాల నియంత్రణతో పాటు ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన ‘స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్’ను పునఃప్రారంభించాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే ఇవి అత్యుత్సాహంతో కూడిన డిమాండ్లని ఇరాన్ కొట్టిపారేసింది. దీనికి బదులుగా ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనను తెచ్చింది. యుద్ధాన్ని తక్షణమే ముగించాలని, హర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉండాలని, అలాగే లెబనాన్లోని హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
ఏడో వారంలో యుద్ధం.. ఊగిసలాడుతున్న కాల్పుల విరమణ!
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రస్తుతం ఏడో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,000 మంది, ఇజ్రాయెల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాల పాటు ట్రంప్ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇస్లామాబాద్ నుంచి నిష్క్రమిస్తూ.. "మేము ఒక చివరి, అత్యుత్తమ ఆఫర్ డాక్యుమెంట్ను ఇక్కడ వదిలి వెళుతున్నాం. దానిని ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూడాలి," అని వాన్స్ పేర్కొన్నారు.
హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ..
ప్రపంచ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒప్పందంతో సంబంధం లేకుండా, జలసంధిని తామే స్వయంగా క్లియర్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. అండర్ వాటర్ డ్రోన్లతో సముద్ర మార్గాన్ని క్లియర్ చేసేందుకు అమెరికా బలగాలు సిద్ధమవుతున్నాయి.
తదుపరి పరిణామాలు ఏంటి?
మంగళవారం వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అయితే లెబనాన్ ప్రధాని తన పర్యటనను వాయిదా వేయడంతో ఇవి రాయబార స్థాయిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. అమెరికా-ఇరాన్ చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?
అణు ఆయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ దీర్ఘకాలిక హామీ ఇవ్వడానికి నిరాకరించడం, ఇరు దేశాల డిమాండ్ల మధ్య సమన్వయం కుదరకపోవడమే ప్రధాన కారణం.
2. హర్ముజ్ జలసంధి సమస్య ఏంటి?
ప్రపంచంలోని ఐదో వంతు చమురు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. యుద్ధం వల్ల ఇరాన్ దీనిని మూసివేసింది, దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయాయి.
3. ప్రస్తుతం యుద్ధ పరిస్థితి ఏంటి?
యుద్ధం 7వ వారంలోకి ప్రవేశించింది. 5,000 మందికి పైగా మరణించారు. తాత్కాలిక కాల్పుల విరమణ ముగియడంతో దాడులు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


