ఇరాన్ కీలక పెట్రోకెమికల్ హబ్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు
ఇరాన్లోని అత్యంత కీలకమైన పెట్రోకెమికల్ హబ్లపై అమెరికా, ఇజ్రాయెల్ శనివారం వైమానిక దాడులకు తెగబడ్డాయి. నైరుతి ఇరాన్లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇరాన్లోని అత్యంత కీలకమైన పెట్రోకెమికల్ హబ్లపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడ్డాయి. నైరుతి ఇరాన్లోని మాహ్షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్తో పాటు బందర్ ఇమామ్ సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయని, పలు కంపెనీలు దెబ్బతిన్నాయని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది.

"మాహ్షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్లో భారీ పేలుళ్లు సంభవించాయి" అని ఖుజెస్థాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ను ఉటంకిస్తూ ఫ్రాన్స్ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ సంయుక్త దాడుల్లో ఆ ప్రాంతంలోని అబూ అలీ, రిజాల్, అమీర్ కబీర్ పెట్రోకెమికల్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆస్తినష్టం ఏ మేరకు జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు ఐదుగురు గాయపడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు పెట్రోకెమికల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అత్యవసర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాడుల తీవ్రత దృష్ట్యా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అన్ని పారిశ్రామిక విభాగాల నుంచి సిబ్బందిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుళ్లు ఎక్కడ జరిగాయి, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉందనే అంశాలపై అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు.
ఖుజెస్థాన్ ప్రావిన్స్లోని బందర్ ఇమామ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్పై కూడా వైమానిక దాడులు జరిగాయని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ దాడుల వల్ల కాంప్లెక్స్లోని కొన్ని విభాగాలు దెబ్బతిన్నాయని ఇరాన్ వార్తా సంస్థ మెహర్ తెలిపింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని ఆర్థిక వనరులే లక్ష్యంగా దాడులు చేయాలని ఇజ్రాయెల్ రాజకీయ నాయకత్వం గత వారమే ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళాలు)కు ఆదేశాలు జారీ చేసినట్లు 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పత్రిక కథనం ప్రచురించింది. ఇరాన్ పాలకులకు భారీ ఆర్థిక నష్టం కలిగించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఈ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


