US Iran War : 'డెడ్లైన్'కి ముందు ట్రంప్ బిగ్ న్యూస్- కాల్పుల విరమణకు ఓకే, హార్ముజ్ జలసంధి ఓపెన్!
Ceasefire : ప్రపంచ దేశాలు ఊపిరిపీల్చుకున్నాయి! 48 గంటల డెడ్లైన్కి సానుకూల ముగింపు పడింది. ఇరాన్పై కాల్పుల విరణమకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది.
ఇరాన్కు ఇచ్చిన ‘డెడ్లైన్’ సమీపించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ప్రకటన చేశారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన దౌత్య ప్రయత్నాల తర్వాత, ఇరాన్పై అమెరికా దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బదులుగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందని వివరించారు.
48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం - ట్రంప్ ప్రకటన:
'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందిస్తూ.. "పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లతో నేను జరిపిన సంభాషణల ఆధారంగా, ఈ రాత్రి ఇరాన్కు పంపాల్సిన వినాశకరమైన బలగాలను నిలిపివేయాలని వారు నన్ను కోరారు. దీనికి బదులుగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హార్ముజ్ జలసంధిని 'పూర్తిగా, తక్షణమే, సురక్షితంగా' తెరిచేందుకు అంగీకరించాలి. ఈ షరతుకు లోబడి, ఇరాన్పై బాంబు దాడులు, ఇతర దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి నేను అంగీకరిస్తున్నాను" అని రాశారు.
ఈ కాల్పుల విరమణ ‘రెండు వైపులా’ ఉంటుందని, అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలన్నింటినీ మించి సాధించిందని ఆయన అభివర్ణించారు. ఇరాన్ సమర్పించిన 10 పాయింట్ల ప్రతిపాదన చర్చలకు “ఆచరణాత్మక ప్రాతిపదిక”గా ఉందని, ఈ రెండు వారాల సమయం ఒప్పందాన్ని ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అంగీకారం..
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ కాల్పుల విరమణను అంగీకరిస్తూ 'ఎక్స్' లో ప్రకటన చేశారు.
"ప్రధాని షరీఫ్ చేసిన సోదర విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, అలాగే అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రతిపాదన, ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనను చర్చలకు ప్రాతిపదికగా అమెరికా ఆమోదించినందున.. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున నేను ఈ ప్రకటన చేస్తున్నాను: ఇరాన్పై దాడులు ఆగితే, మా శక్తివంతమైన సాయుధ దళాలు తమ రక్షణ చర్యలను నిలిపివేస్తాయి," అని పేర్కొన్నారు. రాబోయే రెండు వారాల పాటు ఇరాన్ దళాల సమన్వయంతో హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
కాల్పుల విరమణ ఎలా పనిచేస్తుంది?
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన ఈ రెండు వారాల విరామం, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచేలా చేస్తుంది. ఈ సమయంలో చర్చలు జరిపి సంఘర్షణను శాశ్వతంగా ముగించే దిశగా పెద్ద ఒప్పందాన్ని రూపొందిస్తారు. తెర వెనుక చర్చలు వేగవంతమయ్యాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉంది.
మిత్రదేశాల అభిప్రాయం..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, సౌదీ అరేబియా, యూఏఈ నాయకులు ఇరాన్ నుంచి ప్రధాన రాయితీలు పొందాలని ట్రంప్ను ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ బృందంలోని జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్ వంటి వారు ఇరాన్ షరతులకు అంగీకరిస్తే ఒప్పందం చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
మధ్యప్రాచ్య దౌత్యంలో ఈ రెండు వారాల కాలం అత్యంత కీలకమైనది, ఇది సైనిక యుద్ధాన్ని నివారించి శాంతియుత ఒప్పందానికి అవకాశం కల్పిస్తుంది.
తాజా పరిణామాల మధ్య ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పడుతున్నాయి.
ఏదేమైనా.. ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తానన్న ట్రంప్.. స్వయంగా కాల్పుల విరమణ ప్రకటన చేయడంతో ప్రపంచ దేశాలు సైతం ఊపిరి పీల్చుకున్నాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది?
ఈ ఒప్పందం ప్రాథమికంగా రెండు వారాల పాటు (14 రోజులు) అమల్లో ఉంటుంది. ఈ సమయంలో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు.
2. హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించిందా?
అవును, అమెరికా దాడులను నిలిపివేస్తే, తమ దళాల సమన్వయంతో జలసంధి ద్వారా సురక్షితమైన రవాణాకు అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


