Iran war : ఇరాన్పై అమెరికా దాడులు- హర్ముజ్ జలసంధి వద్ద మళ్లీ కలకలం..
US Iran war : పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మరోసారి పెరిగాయి. అమెరికా- ఇరాన్ దళాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఫలితంగా ముడి చమురు ధర మరోసారి భగ్గుమంది. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం లేకపోలేదు!
ఇరాన్తో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'హర్ముజ్ జలసంధి' గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు తాము ఇరాన్పై సరికొత్త వైమానిక దాడులను ప్రారంభించినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. టర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ నమ్మదగని దేశమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒకేసారి 7 శాతం మేర పెరిగాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన ముడిచమురు అవసరాల కోసం అత్యధికంగా పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడుతుండటంతో, రానున్న రోజుల్లో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు..
ఈ ఉద్రిక్తతలకు బీజం మంగళవారం నాడే పడింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ సాయుధ దళాలు దాడులు చేశాయి. దీనికి ప్రతికారంగా బుధవారం నాడు బహ్రెయిన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడింది. దీనితో అమెరికా తక్షణమే అప్రమత్తమై ఇరాన్ భూభాగంపై ప్రతికార దాడులు ప్రారంభించింది.
"అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఇరాన్పై అదనపు దాడులు ప్రారంభించాయి. హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని అడ్డుకునేలా ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడమే మా లక్ష్యం. అంతర్జాతీయ జలమార్గంలో వాణిజ్య నౌకలు, పౌరులపై ఇరాన్ చేస్తున్న అకారణ దాడులను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది," అని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హర్ముజ్ జలసంధి ఎందుకంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడిచమురులో ఐదో వంతు (సుమారు 20 శాతం) కేవలం ఈ హర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. భౌగోళికంగా ఈ ప్రాంతం ఇరాన్ నియంత్రణలో ఉండటం వల్ల అమెరికా వంటి ప్రపంచ అగ్రరాజ్యాన్ని కూడా ఇరాన్ ఇక్కడ ముప్పుతిప్పలు పెట్టగలుగుతోంది. ప్రస్తుత దాడులకు తామే బాధ్యులమని ఇరాన్ బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ, అమెరికాతో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్న వేళ తన బలాన్ని నిరూపించుకోవడానికే ఇరాన్ ఈ వ్యూహాత్మక దాడులకు పాల్పడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముక్కలైన జూన్ 17 శాంతి ఒప్పందం!
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై జరిపిన భారీ వైమానిక దాడులతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తతల నడుమ జూన్ 17న ఇరు దేశాల మధ్య ఒక తాత్కాలిక శాంతి ఒప్పం కుదిరింది. ఆ ఒప్పందాన్ని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు చర్చలు జరుగుతున్న తరుణంలోనే తాజా దాడులు జరగడం గమనార్హం. దీనితో ఈ శాంతి ప్రయత్నాలకు పూర్తిగా బ్రేకులు పడ్డట్లయింది.
"ఇరాన్తో మనం ఎలాంటి ఒప్పందం చేసుకున్నా, వారు దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం నాకు లేదు. వారు ఏమాత్రం గౌరవప్రదమైన వ్యక్తులు కారు," అని అంకారా సదస్సులో ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, పరిస్థితులు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం లేదని, ప్రస్తుతానికి ఇరాన్తో చర్చలు కొనసాగుతాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదని ట్రంప్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


