అమెరికాలో మార్మోగుతున్న 'ఇండియా డే'.. ఆగస్టు 15పై ప్రత్యేక ప్రకటనలు

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15ను 'ఇండియా డే'గా ప్రకటిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ బాటలోనే డెలావేర్ రాష్ట్రం కూడా భారతీయ సమాజం సేవలను కొనియాడుతూ అధికారికంగా ఈ ఘనతను ప్రకటించింది.

Published on: Aug 13, 2026, 19:41:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాషింగ్టన్: భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 'ఇండియా డే' సందడి కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక, సామాజిక పురోగతిలో ఇండో-అమెరికన్ల పాత్రను గుర్తిస్తూ పలు రాష్ట్రాలు ప్రత్యేక ప్రకటనలు (Proclamations) జారీ చేస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, మాసచుసెట్స్ రాష్ట్రాల సరసన తాజాగా డెలావేర్ కూడా చేరింది.

అమెరికాలో మార్మోగుతున్న 'ఇండియా డే'.. ఆగస్టు 15పై ప్రత్యేక ప్రకటనలు
అమెరికాలో మార్మోగుతున్న 'ఇండియా డే'.. ఆగస్టు 15పై ప్రత్యేక ప్రకటనలు

డెలావేర్ గవర్నర్ సందేశం

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాథ్యూ మేయర్ అధికారికంగా 'ఇండియా డే' ప్రకటనపై సంతకం చేశారు. విభిన్న సంస్కృతులు, ఆచారాలు తమ రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేశాయని ఆయన పేర్కొన్నారు.

"డెలావేర్‌లోని భారతీయ సంతతి ప్రజలు తమ కష్టం, నాయకత్వ పటిమ, సేవా భావంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు" అని గవర్నర్ మాథ్యూ మేయర్ కొనియాడారు.

వివిధ భాషలు, ఆచారాలు, నమ్మకాలతో కూడిన భారతీయ సాంప్రదాయాలను ఇండో-అమెరికన్లు అమెరికాలోనూ సజీవంగా కాపాడుకుంటూ, ఇక్కడి సమాజ నిర్మాణంలో భాగమయ్యారని ప్రకటనలో స్పష్టం చేశారు. భారత ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత గౌరవించుకోవాలని ఆయన డెలావేర్ పౌరులకు పిలుపునిచ్చారు.

న్యూయార్క్, న్యూజెర్సీలలోనూ అధికారిక గుర్తింపు

డెలావేర్‌కు ముందే న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్, న్యూజెర్సీ గవర్నర్ మైకీ షెరిల్ ఆగస్టు 15ను 'ఇండియా ఇండిపెండెన్స్ డే'గా గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకల్లో భాగంగా వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, ఐక్యరాజ్యసమితిలోని భారత మిషన్‌తో పాటు ప్రధాన నగరాల్లోని కాన్సులేట్లలో జాతీయ పతాకావిష్కరణలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భారతీయ సమాజం ఆధ్వర్యంలో భారీ పరేడ్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

త్రివర్ణ శోభలో అమెరికా ల్యాండ్‌మార్క్‌లు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు భారతీయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమెరికా ఆర్థిక, సామాజిక ప్రగతిలో భారత సంతతి అందిస్తున్న సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

ఈ ప్రత్యేక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని ప్రసిద్ధ 'ఎంపైర్ స్టేట్ బిల్డింగ్', సియాటిల్‌లోని 'స్పేస్ నీడిల్' సహా పలు చారిత్రక భవనాలు భారత త్రివర్ణ పతాక కాంతులతో వెలిగిపోనున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More