వైట్ హౌస్‌లో కొత్త అతిథి.. నాలుగోసారి గర్భం దాల్చిన ఉషా వ్యాన్స్

అమెరికా సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ నాలుగోసారి గర్భం దాల్చారు. పదవిలో ఉండగా తల్లి కాబోతున్న తొలి ఉపాధ్యక్షుడి భార్యగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారు. 1963లో జాక్వెలిన్ కెన్నెడీ తర్వాత, వైట్ హౌస్‌లో బిడ్డకు జన్మనివ్వబోతున్న మొదటి తల్లి కూడా ఆమే కావడం విశేషం.

Published on: Jan 21, 2026, 07:29:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా రాజకీయ చరిత్రలో భారత సంతతి మహిళ, సెకండ్ లేడీ ఉషా వ్యాన్స్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 40 ఏళ్ల ఉష ప్రస్తుతం తన నాలుగో బిడ్డతో గర్భవతిగా ఉన్నారని, ఇది అమెరికా చరిత్రలోనే ఒక ప్రత్యేక సందర్భమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య పదవిలో ఉండగా గర్భం దాల్చడం ఇదే మొదటిసారి.

వైట్ హౌస్‌లో కొత్త అతిథి.. నాలుగోసారి గర్భం దాల్చిన ఉషా వ్యాన్స్ (AP)
వైట్ హౌస్‌లో కొత్త అతిథి.. నాలుగోసారి గర్భం దాల్చిన ఉషా వ్యాన్స్ (AP)

60 ఏళ్ల తర్వాత మళ్లీ..

గతంలో 1963లో అప్పటి ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీ వైట్ హౌస్‌లో ఉండగా పాట్రిక్ బౌవియర్ కెన్నెడీకి జన్మనిచ్చారు. ఆ తర్వాత మళ్లీ దశాబ్దాల కాలం గడిచినా, శ్వేతసౌధంలో ఇటువంటి వేడుక జరగలేదు. ఇప్పుడు ఉషా వ్యాన్స్ రూపంలో వైట్ హౌస్‌లోకి మళ్లీ ఒక చిన్నారి రాబోతుండటంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

"ఉష నాలుగోసారి గర్భం దాల్చిన వార్తను పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మగబిడ్డ పుట్టబోతున్నాడు. ఉష, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. జూలై నెలాఖరులో మా కుటుంబంలోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించడానికి మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.

తమ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మిలిటరీ వైద్యులకు, సిబ్బందికి ఈ సందర్భంగా వ్యాన్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో ఉంటూనే, పిల్లలతో గడుపుతూ ఒక అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని వారు మురిసిపోయారు.

యాలే లా స్కూల్ నుంచి వైట్ హౌస్ వరకు..

ఉష, జేడీ వ్యాన్స్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వీరిద్దరూ 2013లో యేల్ లా స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కలుసుకున్నారు. మొదటి డేట్‌లోనే ఉషకు తన ప్రేమను వ్యక్తపరిచినట్లు వ్యాన్స్ తన జ్ఞాపకాల్లో రాసుకున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జేడీ వ్యాన్స్‌కు, విద్యావేత్తల కుటుంబానికి చెందిన ఉష ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు.

2014 జూన్ 14న వీరి వివాహం జరిగింది. ఉష భారతీయ మూలాలను గౌరవిస్తూ అప్పట్లో హిందూ సంప్రదాయంలోనూ వేడుకలు జరుపుకున్నారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఇవాన్ (8), వివేక్ (5) తో పాటు ఒక కుమార్తె మిరాబెల్ (4) ఉన్నారు.

వివాదాల మధ్య తీపి కబురు

ఇటీవలి కాలంలో వీరి వ్యక్తిగత జీవితంపై కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఉషను క్రైస్తవ మతంలోకి మారాలని కోరుకుంటున్నట్లు వ్యాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అలాగే ఒక కార్యక్రమంలో ఎరికా కిర్క్ అనే మహిళను వ్యాన్స్ ఆలింగనం చేసుకున్న వీడియోలు వైరల్ కావడంతో, వీరి వివాహ బంధంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు నాలుగో బిడ్డ రాబోతున్నాడన్న వార్తతో ఆ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More