వందే భారత్ స్లీపర్: 260 రైళ్లతో రైల్వే శాఖ భారీ ప్లాన్

మెరుగైన సౌకర్యాలతో కూడిన 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే బృహత్తర ప్రణాళిక రూపొందించింది. గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో విమాన తరహా సౌకర్యాలు లభించనున్నాయి.

Published on: Sep 5, 2026, 15:50:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పగటిపూట ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైళ్లుగా గుర్తింపు పొందిన వందే భారత్ ఇప్పుడు రాత్రివేళ ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ సర్వీసులను విస్తరించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 260 వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని సంకల్పించింది.

వందే భారత్ స్లీపర్: 260 రైళ్లతో రైల్వే శాఖ భారీ ప్లాన్ (X/@Infragati)
వందే భారత్ స్లీపర్: 260 రైళ్లతో రైల్వే శాఖ భారీ ప్లాన్ (X/@Infragati)

ఈ స్లీపర్ సిరీస్‌లో తొలి రైలు గువాహాటీ-హౌరా మార్గంలో ఇప్పటికే ప్రయాణికులకు అందుబాటులోకి రాగా, రెండో రైలు ప్రస్తుతం పట్టాలపై ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుంటోంది. ఈ రెండో రైలును బెంగళూరు - ముంబై మార్గంలో నడిపే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై రైల్వే శాఖ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

రైళ్ల తయారీ బాధ్యతలు ఎవరివంటే..

ఈ 260 వందే భారత్ స్లీపర్ రైళ్ల ఉత్పత్తిని పలు ప్రముఖ తయారీ సంస్థలు పంచుకోనున్నాయి. మొదటి 10 స్లీపర్ రైళ్లను 'బీఈఎంఎల్' (BEML) సంస్థ తయారు చేస్తోంది. ఇవి ఒక్కోటి 16 కోచ్‌లతో రూపొందుతున్నాయి. చెన్నైలోని 'ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ' (ICF) మరొక 50 రైళ్లను తయారు చేయనుంది. ఇవి 24 కోచ్‌లతో పాటు ప్రత్యేక పాంట్రీ కార్‌ను కలిగి ఉంటాయి.

మరో 200 రైళ్ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్‌లో భాగంగా.. 'ఆర్‌వీఎన్ఎల్' (RVNL), రష్యాకు చెందిన 'ట్రాన్స్‌మాష్ హోల్డింగ్' భాగస్వామ్యంతో ఏర్పడిన 'కైనెట్ రైల్వే సొల్యూషన్స్' (Kinet Railway Solutions) 120 రైళ్లను ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన 80 రైళ్లను 'టిటాగఢ్-బీహెచ్ఈఎల్' (Titagarh-BHEL) ఉమ్మడి సంస్థ నిర్మిస్తుంది. మహారాష్ట్ర లాతూర్ లోని మరాఠ్వాడా రైల్ కోచ్ ఫ్యాక్టరీలో కైనెట్ సంస్థ తన ఉత్పత్తిని చేపట్టింది. ఈ సంస్థ తన తొలి ప్రోటోటైప్ రైలును 2027 మార్చి 31 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గంటకు 160 కిలోమీటర్ల వేగం

వందే భారత్ స్లీపర్ రైళ్లను గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. ట్రాక్ మౌలిక వసతులు, రూట్ ఆధారంగా పట్టాలపై వీటిని గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. సాధారణ రైళ్లలాగా వీటిని లాగడానికి ప్రత్యేక లోకోమోటివ్ (ఇంజిన్) అవసరం లేదు. డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్‌తో నడిచే ఈ రైళ్లలో త్వరితగతిన వేగం అందుకోవడం, క్షణాల్లో బ్రేకులు వేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.

విమానం తరహా ప్రీమియం సదుపాయాలు

ప్రస్తుతం సిద్ధమవుతున్న 16 కోచ్‌ల రైలులో 11 ఏసీ 3-టియర్, 4 ఏసీ 2-టియర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. రాత్రివేళ సుఖవంతమైన ప్రయాణం కోసం మెత్తటి బెర్త్‌లు, రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డిస్ప్లే బోర్డులు, సమాచారాన్ని అందించే స్పీకర్ వ్యవస్థలను అమర్చారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ తలుపులు, కోచ్‌ల మధ్య శబ్దం రాకుండా ఉండేలా సీల్డ్ గ్యాంగ్‌వేలను ఏర్పాటు చేశారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లలో అదనపు హంగుగా వేడి నీటితో కూడిన షవర్ సదుపాయం కల్పించారు.

భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం

రైలు ప్రమాదాలను నివారించేందుకు భారతీయ స్వదేశీ పరిజ్ఞానం 'కవచ్' (KAVACH) వ్యవస్థను ఈ రైళ్లలో అమర్చారు. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్, సెంట్రలైజ్డ్ కోచ్ మానిటరింగ్‌తో పాటు విద్యుత్ పొదుపునకు తోడ్పడే రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. ప్రయాణికులలో పరిశుభ్రత పెంచేందుకు విమానాల్లో వాడే తరహా 'బయో వాక్యూమ్' మరుగుదొడ్లను చేర్చారు. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక వాష్‌రూమ్ వసతులు ఉన్నాయి.

ఈ 260 రైళ్ల రాక ఒకేసారి కాకుండా విడతల వారీగా జరగనుంది. ప్రోటోటైప్ రైళ్ల తయారీ, ట్రయల్స్, సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే వివిధ రూట్లలో వీటిని ప్రవేశపెడతారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More