కోహ్లి మెరుపు షాట్.. ఆశ్చర్యంలో రిషబ్ పంత్.. రియాక్షన్ వైరల్.. నెట్స్ లో ఏం జరిగిందంటే?
దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు ముందు నెట్స్ సెషన్లో విరాట్ కోహ్లీ దూకుడును చూసి రిషబ్ పంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "భాయ్ జీ, అచా బాల్ థా యే. టగ్డా మార్ దియ" అంటూ పంత్ రియాక్టయ్యాడు. ఇది వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి రంగం సిద్ధమైంది. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఆదివారం (నవంబర్ 30) రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి వన్డేలో బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తూ, తమ సన్నద్ధతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. మిగతా భారత జట్టు కంటే ముందే తొలి వన్డే వేదికకు చేరుకున్న ఈ జోడీ, అవసరమైన మేరకు సాధన చేయడానికి సమయం తీసుకుంది.

కోహ్లి మెరుపు షాట్
శనివారం (నవంబర్ 29) నెట్ సెషన్ లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ లో మెరుపు షాట్లు కొట్టాడు కోహ్లి. ఎడమచేతి వాటం పేసర్ను కోహ్లి మెరుగ్గా ఎదుర్కొన్నాడు. అర్ష్దీప్ బంతిని షార్ట్ సైడ్లో వేయగా, 37 ఏళ్ల కోహ్లీ అద్భుతమైన ఏరియల్ షాట్ కొట్టాడు. ఆ షాట్ను చూసి వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ఆశ్చర్యపోయాడు. "భాయ్ జీ, అచా బాల్ థా యే. టగ్డా మార్ దియా (భాయ్ అది మంచి బంతి. అద్భుతమైన షాట్)’’ అని అని స్టంప్స్ వెనుక నుండి పంత్ అన్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
రోకో జోడీ
రోహిత్, కోహ్లి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. టెస్టులు, టీ20లకు వీళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో రాంచీలో ఫస్ట్ వన్డే మ్యాచ్కు అత్యుత్తమ సన్నద్ధత కోసం వీరిద్దరూ నెట్స్ సెషన్లో 100% తీవ్రతను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో ఈ జోడీ తిరిగి వచ్చింది. అందులో రోహిత్ తన ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు కోహ్లీ తొలి రెండు వన్డేల్లో రెండు డక్లతో కొంత ఇబ్బంది పడ్డాడు. అయితే సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్లో అజేయమైన 74 పరుగులతో బలమైన పునరాగమనం చేశాడు.
నెట్స్ లో సరదాగా
నెట్ సెషన్లో రోహిత్, కోహ్లి ప్రాక్టీస్ చేయడంతో పాటు మిగతా టీమ్ మేట్స్ తో సరదాగా గడిపారు. శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, తనతో పాటు ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్న యశస్వి జైస్వాల్తో సుదీర్ఘంగా సంభాషిస్తూ కనిపించాడు రోహిత్. మరోవైపు కోహ్లీ కూడా ఉల్లాసంగా ఉంటూ పంత్, అర్ష్దీప్లతో సరదాగా గడిపాడు. ఆదివారం ఇండియా, సౌతాఫ్రికా మధ్య రాంచీలో ఫస్ట్ వన్డే జరుగుతుంది.













