అమెరికాలో భారత మహిళ హత్య- శరీరంపై కత్తిపోట్లు.. మాజీ ప్రియుడే చంపేశాడా?

అమెరికాలోని మేరీల్యాండ్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ నిఖితా గొడిశాల హత్యకు గురయ్యారు. మాజీ ప్రియుడే ఆమెను కత్తితో పొడిచి చంపి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి భారత్‌కు పారిపోయినట్లు విచారణలో తేలింది.

Published on: Jan 5, 2026, 06:45:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికాలో మరో భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది! కొత్త సంవత్సరం వేడుకల సమయంలో అదృశ్యమైన 27ఏళ్ల నిఖితా గొడిశాల, తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లోనే శవమై తేలారు. మేరీల్యాండ్‌లోని కొలంబియాలో జరిగిన ఈ ఘోర ఉదంతం స్థానికంగా ఉన్న ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిఖిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అమెరికాలో భారత మహిళ దారుణ హత్య.. (Unsplash)
అమెరికాలో భారత మహిళ దారుణ హత్య.. (Unsplash)

తానే ఫిర్యాదు చేసి.. ఇండియాకు పారిపోయాడు!

ఈ కేసు విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు విస్తుగొలుపుతున్నాయి. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ప్రధాన నిందితుడని హౌవార్డ్ కౌంటీ పోలీసులు అనుమానిస్తున్నారు. జనవరి 2న అర్జున్ శర్మ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి.. డిసెంబర్ 31 నుంచి నిఖిత కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తనని చివరిసారిగా తన ఇంట్లో కలిశానని, ఆ తర్వాత ఆమె అదృశ్యమైందని చెప్పాడు.

అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అతను అమెరికా వదిలి భారత్‌కు విమానంలో వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు.

అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా..

అర్జున్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం కలిగి, జనవరి 3న సెర్చ్ వారెంట్‌తో కొలంబియాలోని ట్విన్ రివర్స్ రోడ్‌లో ఉన్న అతని అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేపట్టారు. అక్కడ నిఖిత విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.

డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల సమయంలోనే అర్జున్ ఆమెను హత్య చేసి ఉంటాడని డిటెక్టివ్‌లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కేసు నమోదు.. నిందితుడి కోసం వేట

"అర్జున్ శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ మర్డర్ కేసులు నమోదు చేశాం. అతని కోసం అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది," అని హౌవార్డ్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం భారత్‌లో ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు అమెరికాలోని ఎఫ్​బీఐ సహాయం తీసుకుంటున్నారు.

అయితే, ఈ నిఖిత గొడిశాల హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

నిఖిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

నిఖిత గోడిశాల హత్యకు సంబంధించిన వివరాలను హౌవాడ్​ పోలీసులు ట్విట్టర్​ వేదికగా షేర్​ చేశారు. ఆ పోస్ట్​ కింద సెంటెరిస్ట్​ అనే అకౌంట్​ నుంచి ఒక పెద్ద కామెంట్​ రాసి ఉంది.

“నా పేరు సరస్వతి గోడిశాల. నిఖిత నా కజిన్​ సోదరి. డిసెంబర్​ 27న నా నుంచి, నా సోదరి నుంచి అర్జున్​ డబ్బులు అడిగాడు. నేను 4,500 డాలర్లు పంపించాను. అనంతరం అతను 3,500 డాలర్లు వెనక్కి ఇచ్చేశాడు. జనవరి 2న అర్జున్​ మళ్లీ నన్ను సంప్రదించాడు. 100 డాలర్లు పంపాలని అడిగాడు. నేను ఇవ్వలేదు. మిగిలిన 1000 డాలర్లు ఇవ్వాలని నిఖిత అర్జున్​ని అడిగింది. కానీ నా సోదరి శవమై తేలింది. అర్జునే తనని చంపేసినట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి పారిపోయే ముందు నా సోదరి బ్యాంక్​ అకౌంట్​లో ఉన్న 3,500 డాలర్లలను అతను దోచుకున్నట్టు సమాచారం. జనవరి 4 తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు అతను ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిఖిత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలి. నిఖితకు న్యాయం జరిగేలా చూడాలి,” అని సంబంధిత కామెంట్​లో ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More