Avenger Street 220 : బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ కొనాలా? వద్దా? ఇవి తెలుసుకోండి..
బజాజ్ ఆటో భారత్లో సరికొత్త అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ను రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవెంజర్ 160 స్థానంలో వచ్చిన ఈ పవర్ఫుల్ బైక్, అవెంజర్ 220 క్రూయిజ్ మోడల్కు గట్టి పోటీ ఇవ్వనుంది.
భారతీయ క్రూయిజర్ బైక్ సెగ్మెంట్లో సుదీర్ఘ కాలంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న 'బజాజ్ అవెంజర్' సిరీస్ నుంచి బైక్ ప్రియుల కోసం ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. తన పాపులర్ మోడల్ ‘బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్’ను సరికొత్త మార్పులతో ఇటీవలే భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది. దేశీయంగా దీని ప్రారంభ ధరను రూ. 1.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.

ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న తక్కువ పవర్ గల అవెంజర్ 160 మోడల్ను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. దీని స్థానంలోనే ఇప్పుడు కొత్త అవెంజర్ 220 స్ట్రీట్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం బజాజ్ లైనప్లో అవెంజర్ 220 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూయిజ్ అనే రెండు మోడళ్లు మాత్రమే క్రూయిజర్ విభాగాన్ని లీడ్ చేయనున్నాయి. ఈ రెండు బైక్లలో ఒకే రకమైన ఇంజిన్, ఒకే రకమైన మెకానికల్ ఫీచర్లు ఉన్నప్పటికీ, కస్టమర్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
పల్సర్ 220ఎఫ్ ఇంజిన్.. మరింత పవర్..
పాత అవెంజర్ 160 స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన ఈ కొత్త అవెంజర్ 220 స్ట్రీట్ బైక్లో బజాజ్ సంస్థ తన ఐకానిక్ బైక్ ‘పల్సర్ 220ఎఫ్’కి చెందిన పవర్ఫుల్ ఇంజిన్ను ఉపయోగించింది.
ఇంజిన్ సామర్థ్యం: ఇందులో 220 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ను అమర్చారు.
పవర్ అండ్ టార్క్: ఈ ఇంజిన్ గరిష్టంగా 19 హెచ్పీ పవర్, 17.5 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్బాక్స్ను జత చేశారు.
హైవే పర్ఫార్మెన్స్: పాత 160 మోడల్తో (15 హెచ్పీ, 13.7 ఎన్ఎమ్) పోలిస్తే ఈ కొత్త 220 సీసీ ఇంజిన్ లాంగ్ రైడ్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హైవేలపై లాంగ్ క్రూయిజింగ్ చేయడం దీనివల్ల మరింత సులువు అవుతుంది.
తక్కువ సీటు ఎత్తు.. తిరుగులేని కంఫర్ట్..
బజాజ్ అవెంజర్ సిరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని రైడింగ్ కంఫర్ట్. కొత్త అవెంజర్ 220 స్ట్రీట్, క్రూయిజ్.. ఈ రెండు మోడళ్లలోనూ రైడర్ల సౌకర్యానికి పెద్ద పీట వేశారు. ఈ బైక్ల సీటు ఎత్తు కేవలం 737 ఎంఎం మాత్రమే ఉంటుంది. దీనివల్ల తక్కువ ఎత్తు (షార్ట్ రైడర్స్) ఉన్నవారు సైతం ఈ బైక్ను చాలా సులభంగా, బ్యాలెన్స్డ్గా నడపవచ్చు. ముందుకు అమర్చిన ఫుట్పెగ్స్, రిలాక్స్డ్ హ్యాండిల్బార్ పొజిషన్ వల్ల ఎంత దూరం ప్రయాణించినా అలసట లేకుండా అచ్చమైన క్రూయిజర్ బైక్ నడుపుతున్న అనుభూతి కలుగుతుంది.
ధర ఎంత పెరిగింది?
కొత్త అవెంజర్ 220 స్ట్రీట్ ధర రూ. 1.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. నిలిపివేసిన అవెంజర్ 160 మోడల్తో పోలిస్తే దీని ధర దాదాపు రూ. 18,000 వరకు పెరిగింది. అయితే, ఈ అదనపు ధరకు తగ్గట్టుగానే కస్టమర్లకు పెద్ద ఇంజిన్, హైవేలపై మెరుగైన ప్రయాణ సామర్థ్యం, రోడ్డుపై తిరుగులేని బోల్డ్ లుక్ లభిస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అవెంజర్ 220 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూయిజ్ రెండింటి ధరనూ బజాజ్ సమానంగానే ఉంచింది. దీనివల్ల కస్టమర్లు ధర గురించి ఆలోచించకుండా కేవలం తమకు నచ్చిన స్టైల్ ఆధారంగా బైక్ను ఎంచుకోవచ్చు.
స్ట్రీట్ వర్సెస్ క్రూయిజ్: మీకు ఏది బెస్ట్?
ఇంజిన్ పరంగా రెండు బైక్లు ఒక్కటే అయినప్పటికీ, లుక్, వాడుక పరంగా వీటి శైలి వేరు.
బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్: ఈ బైక్ పూర్తిగా బ్లాక్డ్-అవుట్ థీమ్తో (నలుపు రంగు పార్ట్స్) వస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్లను అందించారు. రోజువారీ సిటీ అవసరాలకు, ఆఫీస్ ప్రయాణాలకు, టైర్ పంచర్ అయినా సులభంగా రిపేర్ చేసుకోవడానికి ఈ మోడల్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది.
బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్: ఇది క్లాసిక్ క్రూయిజర్ లుక్తో వస్తుంది. బైక్ అంతటా క్రోమ్ ఫినిషింగ్, స్పోక్ వీల్స్ (కడ్డీల చక్రాలు), ట్యూబ్ టైర్లు, ముందు భాగంలో పెద్ద విండ్స్క్రీన్ ఉంటాయి. సాంప్రదాయ క్రూయిజర్ బైక్ లుక్ ఇష్టపడే వారికి, లాంగ్ టూరింగ్ చేయాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
క్యాజువల్ సిటీ రైడింగ్, సులభమైన మెయింటెనెన్స్ కోరుకునే వారికి అవెంజర్ 220 స్ట్రీట్ సరైన ఎంపిక. అలా కాకుండా ఎక్కువ క్రోమ్ లుక్, టూరింగ్ ఫ్రెండ్లీ స్టైల్ కావాలనుకుంటే అవెంజర్ 220 క్రూయిజ్ వైపు మొగ్గు చూపవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


