VinFast Taxi India : భారత క్యాబ్​ బిజినెస్​లోకి విన్​ఫాస్ట్- తక్కువ ధరకే కస్టమర్లకు ఈవీ రైడ్..

Vinfast Green SM : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ వియత్నం.. భారత మార్కెట్​ని బలంగానే టార్గెట్​ చేస్తోంది! ఇప్పటివరకు ఈవీలను విక్రయించిన ఈ సంస్థ, ఇప్పుడు ట్యాక్సీ సర్వీస్​ బిజినెస్​లోకి కూడా అడుగుపెట్టబోతోంది. అంతేకాదు, కస్టమర్లకు తక్కువ ధరకే ఈవీ రైడ్స్​ని అందిచనుంది.

Published on: Jun 2, 2026, 09:58:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’.. భారతదేశంలో కేవలం కార్లను అమ్మడమే కాకుండా, క్యాబ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. తన అంతర్జాతీయ సబ్-బ్రాండ్ ‘గ్రీన్ ఎస్ఎం’ పేరుతో ఆల్-ఎలక్ట్రిక్ ట్యాక్సీ సర్వీస్‌ను భారత్‌లో ప్రారంభించనుంది. భారతీయ వినియోగదారులకు తక్కువ ధరలో పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని అందించడంతో పాటు దేశంలో ఈవీల వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ లగ్జరీ క్యాబ్ సేవలను విన్​ఫాస్ట్ తీసుకొస్తోంది.

ఇండియాలోకి విన్​ఫాస్ట్​ గ్రీన్ ఎస్​ఎం సేవలు..
ఇండియాలోకి విన్​ఫాస్ట్​ గ్రీన్ ఎస్​ఎం సేవలు..

ప్రస్తుతం మార్కెట్ ఏలుతున్న ఓలా, ఉబెర్ సంస్థలకు గట్టి పోటీనిస్తూ.. కిలోమీటరుకు కేవలం రూ. 8కే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, రద్దీ సమయాల్లో ఎలాంటి 'సర్జ్ ప్రైసింగ్' (అదనపు బాదుడు) ఉండబోదని సంస్థ ప్రకటించింది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రారంభమై, త్వరలోనే బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు విస్తరించనున్న ఈ క్రేజీ ట్యాక్సీ సర్వీస్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ఓలా, ఉబెర్ తరహాలోనే ధర.. కానీ 'సర్జ్ ప్రైసింగ్' లేదు!

వివిధ నివేదికల ప్రకారం.. విన్‌ఫాస్ట్ 'గ్రీన్ ఎస్ఎం' ట్యాక్సీ సర్వీస్ కిలోమీటరుకు సుమారు రూ. 8 చొప్పున ఛార్జ్ చేయనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ఓలా, ఉబెర్ ధరలకు సమానమే. అయితే, ఈ సర్వీస్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. వర్షం పడినప్పుడు లేదా ఆఫీస్ రద్దీ సమయాల్లో డిమాండ్‌ను బట్టి పెరిగే ‘సర్జ్ ప్రైసింగ్’ ఇందులో ఉండదు. దీనివల్ల ప్రయాణికులు ఏ సమయంలోనైనా స్థిరమైన, నమ్మకమైన ఫేర్‌తో ప్రయాణించవచ్చు.

దిల్లీలో ప్రారంభం.. హైదరాబాద్, బెంగళూరుకు విస్తరణ!

తొలి విడత: విన్‌ఫాస్ట్ తన ట్యాక్సీ ఆపరేషన్లను మొదట దిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో ప్రారంభించనుంది. తొలి దశలో సుమారు 1,000 ఎలక్ట్రిక్ కార్లను రోడ్లపైకి తెస్తున్నారు.

భారీ విస్తరణ: రాబోయే 7 నెలల్లో ఈ ఈవీ క్యాబ్​ల సంఖ్యను ఏకంగా 15,000కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోనే అతిపెద్ద ఈవీ ట్యాక్సీ రోల్‌అవుట్‌ల్లో ఇది ఒకటి కానుంది.

దక్షిణాది నగరాలు: దిల్లీ తర్వాత ఈ ఏడాది చివర్లోనే బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌ల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు.

ప్రత్యేకమైన లుక్.. డ్రైవర్లకు భారీ జీతాలు

ఈ ట్యాక్సీ ఫ్లీట్ కోసం కంపెనీ ఇటీవల భారత్‌లో ప్రదర్శించిన 'విన్‌ఫాస్ట్ ఎంపీవీ 7' (7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ) మోడల్‌ను ఉపయోగించబోతోంది! రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రయాణికులు సులభంగా గుర్తించేందుకు వీలుగా ఈ క్యాబ్‌లకు ప్రత్యేకమైన టర్కోయిస్ (నీలి ఆకుపచ్చ) కలర్ పెయింట్‌ను వేయనున్నారు.

కస్టమర్లకే కాకుండా డ్రైవర్లకు కూడా విన్‌ఫాస్ట్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సర్వీస్‌తో జాయిన్ అయ్యే డ్రైవర్లు నెలకు రూ. 35,000 నుండి రూ. 40,000 వరకు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దీనితో పాటు వారి పర్ఫార్మెన్స్ ఆధారంగా అదనపు ఇన్సెంటివ్‌లు, బోనస్‌లు కూడా లభిస్తాయి.

విన్‌ఫాస్ట్‌కు కలిసొచ్చే వ్యూహాత్మక అంశాలు ఇవి..

సొంతంగా ట్యాక్సీ బిజినెస్‌ను నడపడం వల్ల విన్‌ఫాస్ట్ బ్రాండ్‌కు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ట్యాక్సీలు రోడ్లపై తిరుగుతుంటే బ్రాండ్‌కు ఉచిత పబ్లిసిటీ లభిస్తుంది. అలాగే సాధారణ ప్రజలు కూడా ఈ కార్లలో ప్రయాణించి కంపెనీ ఈవీల నాణ్యతను స్వయంగా అనుభవించవచ్చు. అంతేకాకుండా, తమిళనాడులో నిర్మిస్తున్న తమ అప్‌కమింగ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ప్రొడక్షన్ కెపాసిటీని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ భారీ ఆర్డర్ ఉపయోగపడుతుంది.

ఈ తరహా 'గ్రీన్ ఎస్ఎం' ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవలను విన్‌ఫాస్ట్ ఇప్పటికే వియత్నాం, ఇండోనేషియా, లావోస్, ఫిలిప్పీన్స్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విజయవంతంగా నడుపుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More