ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయని అందరూ ఆందోళనతో ఉన్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Published on: Apr 1, 2026, 18:57:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ దిగుమతి ఖర్చులు విపరీతంగా పెరగడంతో.. గృహాలను ఆదుకునేందుకు దేశంలో కేవలం కమర్షియల్ ఎల్‌పీజీ ధరను మాత్రమే పెంచినట్లు, గృహ వినియోగ ఎల్‌పీజీ ధరను యథాతథంగా ఉంచినట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇంధన ధరలపై కేంద్రం క్లారిటీ
ఇంధన ధరలపై కేంద్రం క్లారిటీ

'పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉన్నాయి. మార్కెట్ ఆధారంగా నిర్ణయించబడతాయి. సాధారణంగా నెలవారీగా సవరిస్తారు. దేశంలో వినియోగించే మొత్తం ఎల్పీజీలో వీటి వినియోగం 10 శాతం కంటే తక్కువగా ఉంది.' అని మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 913 వద్ద యథాతథంగా కొనసాగుతూ, గృహ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉందని ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా పీఎంయూవై పథకం కింద పేదల కోసం రాయితీపై అందించే ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 613 వద్ద యథాతథంగా ఉంది.

పాకిస్థాన్‌లో సిలిండర్‌కు రూ. 1,046, శ్రీలంకలో రూ. 1,242, నేపాల్‌లో రూ. 1,208గా ఉన్న ధరతో పోలిస్తే.. భారతదేశ దేశీయ ఎల్‌పీజీ ధర ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా లీటరుకు రూ. 94.77, రూ. 87.67 వద్ద యథాతథంగా ఉన్నాయని(ఢిల్లీ ధరలు) మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి లీటరుకు రూ. 2 సవరణ కేవలం ప్రీమియం పెట్రోల్ వేరియంట్‌లైన XP95, Power95, Speed -అధిక ఆక్టేన్ పనితీరు గల ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. వీటి ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి సవరిస్తారు. వీటి అమ్మకాలు మొత్తం పెట్రోల్, డీజిల్ ధరల అమ్మకాల పరిమాణంలో 2 నుండి 5 శాతం మాత్రమే ఉంటాయి. వాహనదారులు తమ ఇష్టానుసారం ఈ రకమైన పెట్రోల్‌ను కొనుగోలు చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ధరలు 30-50 శాతం మేర పెరిగినప్పటికీ.. భారతదేశంలోని ప్రతి పంపులోనూ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మెుత్తానికి ఇంధన ధరలు పెంచే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. చమురు, గ్యాస్ నిల్వలలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే.. ఆందోళనతో అధికంగా కొనాల్సిన పని లేదని చెప్పింది. ప్రస్తుతానికి ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే.. తదుపరి చర్యలపై కూడా కేంద్రం ఇప్పటి నుంచే ఆలోచిస్తోంది. 2022 ఏప్రిల్‌ నుంచి 2024 మార్చి వరకు డీజిల్‌, పెట్రోలు ధరలను పెంచలేదని కేంద్రం తెలిపింది. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించామని వెల్లడించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More