గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం నడుమ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'బాబ్ అల్-మందేబ్' జలసంధిని మూసివేస్తామని యెమెన్ సంచలన హెచ్చరిక చేసింది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధర బ్యారెల్కు ఏకంగా 200 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యూహాత్మక కూటమితో మూసివేత

యెమెన్కు చెందిన అన్సరుల్లా (హుతీ) ఉద్యమ రాజకీయ విభాగ సభ్యుడు మహ్మద్ అల్-ఫరా ఈ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' ఈ వివరాలను వెల్లడించింది. తమ దేశంలోని పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దాడులను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
"పరిస్థితులు ఇలాగే ముదిరితే, వ్యూహాత్మక కూటమి ద్వారా బాబ్ అల్-మందేబ్, హార్ముజ్ జలసంధులను మూసివేస్తాం. దీనివల్ల చమురు ధరలు బ్యారెల్కు ఏకంగా 200 డాలర్లకు చేరి ప్రపంచ దేశాలకు కోలుకోలేని షాక్ ఇస్తాయి" అని అల్-ఫరా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు.
గ్లోబల్ ట్రేడ్కు ఊపిరిలాంటి జలమార్గాలు
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన రెండు జలమార్గాలు ఏకకాలంలో మూతబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యం ఈ మార్గాల పైనే ఆధారపడి సాగుతోంది.
బాబ్ అల్-మందేబ్ జలసంధి: ఎర్రసముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లను కలిపే ఈ మార్గం సూయజ్ కాలువకు దక్షిణ ద్వారంగా పనిచేస్తుంది. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య దేశాల మధ్య వాణిజ్యానికి ఇది అత్యంత కీలకం. దీని వెడల్పు అత్యంత ఇరుకైన చోట కేవలం 29 కిలోమీటర్లు మాత్రమే. రోజూ దాదాపు 88 లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ప్రపంచ సముద్ర రవాణాలో 10 నుంచి 12 శాతం వాణిజ్యం దీనిపైనే ఆధారపడి ఉంది.
హార్ముజ్ జలసంధి: ఇక్కడి నుంచి రోజూ దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో ఐదో వంతు (20 శాతం) ఈ జలసంధి గుండానే వెళ్తుంది.
{{/usCountry}}హార్ముజ్ జలసంధి: ఇక్కడి నుంచి రోజూ దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో ఐదో వంతు (20 శాతం) ఈ జలసంధి గుండానే వెళ్తుంది.
{{/usCountry}}గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ మార్కెట్లకు ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతి చేయడానికి ఈ రెండే ప్రధాన మార్గాలు.
మారనున్న రవాణా దారులు.. పెరగనున్న ఖర్చులు
ఒకవేళ ఈ రెండు జలసంధులు మూతబడితే, చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు ఆఫ్రికా దక్షిణ కొన వద్ద ఉన్న 'కేప్ ఆఫ్ గుడ్ హోప్' మీదుగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆసియా-ఐరోపా దేశాల మధ్య ప్రయాణ సమయం మరో 12 నుంచి 15 రోజుల పాటు పెరుగుతుంది.
ప్రయాణ సమయం పెరగడంతో ఇంధన వినియోగం, బీమా ప్రీమియంలు, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. పర్యవసానంగా కేవలం క్రూడాయిల్, ఎల్ఎన్జీ మాత్రమే కాకుండా ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరా కూడా తీవ్రంగా ఆలస్యమవుతుంది.
సౌదీ - యెమెన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణలు
సౌదీ అరేబియా మళ్లీ తమపై దాడులకు దిగుతోందని యెమెన్ ఆరోపిస్తోంది. సనా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని రియాద్ దాడులు చేస్తోందని, ఇది కొనసాగితే తాము కూడా దాడులను తీవ్రం చేస్తామని యెమెన్ హెచ్చరిస్తోంది. తాము ఇప్పటికే సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ ఎయిర్ బేస్, అభా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు యెమెన్ దళాలు ప్రకటించాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.