హిందూ ధర్మంలో మహాశివుడిని ఆరాధించే పర్వదినాల్లో ప్రదోష వ్రతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెలకు రెండు సార్లు వచ్చే ఈ త్రయోదశి తిథి శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది. ప్రస్తుతం మనం పవిత్రమైన చైత్ర మాసంలో ఉన్నాం. ఈ మాసంలో వచ్చే తొలి ప్రదోష వ్రతం ఈరోజు, అనగా ఏప్రిల్ 15, బుధవారం నాడు వచ్చింది. బుధవారం నాడు వచ్చే ప్రదోషాన్ని ‘బుధ ప్రదోషం’ అని పిలుస్తారు. నిశ్చలమైన భక్తితో ఈ రోజున శివుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి, జీవితంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
బుధ ప్రదోషం: తిథి, ముహూర్తం వివరాలు

ద్రిక్ పంచాంగం ప్రకారం, చైత్ర మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి 12:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 10:31 గంటలకు తిథి ముగుస్తుంది. ప్రదోష వ్రత పూజను సూర్యాస్తమయం తర్వాతే నిర్వహించాలి కాబట్టి, ఏప్రిల్ 15వ తేదీనే వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.
పూజా ముహూర్తం:
ఏ వ్రతానికైనా శుభ ముహూర్తం చాలా ముఖ్యం. సాయంత్రం శివారాధన చేయడానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే అత్యంత అనుకూలంగా ఉంది.
ముహూర్తం సమయం: ఏప్రిల్ 15, సాయంత్రం 6:01 గంటల నుండి రాత్రి 7:31 గంటల వరకు.
ఈ సమయంలో శివుడిని అర్చించడం వల్ల రెట్టింపు ఫలితాలు అందుతాయని భక్తుల విశ్వాసం.
ప్రదోష కాలంలో పూజా విధానం
ప్రదోష వ్రతం ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
రోజంతా ఉపవాసం ఉండి సాత్విక జీవనాన్ని గడపడం మంచిది.
ముఖ్యమైన పూజ ప్రక్రియ సాయంత్రం ‘ప్రదోష కాలం’లో (సూర్యాస్తమయ సమయం) ప్రారంభమవుతుంది.
శివలింగానికి గంగాజలం, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో కూడిన పంచామృతాలతో అభిషేకం చేయాలి.
శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలు (మారేడు దళాలు), ఉమ్మెత్త పూలు, తెల్లటి పుష్పాలు, పండ్లను సమర్పించాలి.
{{/usCountry}}శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలు (మారేడు దళాలు), ఉమ్మెత్త పూలు, తెల్లటి పుష్పాలు, పండ్లను సమర్పించాలి.
{{/usCountry}}పూజ సమయంలో "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
శివ చాలీసా పఠించి, ధూపదీప నైవేద్యాలతో హారతి ఇచ్చి పూజను ముగించాలి. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటూ నమస్కరించుకోవాలి.
ఈ వ్రతం ఎందుకు చేయాలి?
ప్రదోష వ్రతం వెనుక గొప్ప అర్థం ఉంది. ఈ సమయంలో పరమశివుడు కైలాస పర్వతంపై ఆనంద తాండవం చేస్తాడని, దేవతలందరూ ఆయనను స్తుతిస్తారని ప్రతీతి. బుధవారం వచ్చే ప్రదోషం విజ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం, ఇంట్లోని అశాంతిని తొలగించుకోవడం కోసం ఈ బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ఉత్తమం. నిష్టతో ఈ వ్రతాన్ని చేసే వారికి ఈతి బాధలు తొలిగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.