...
...
Next Story

కేదార్‌నాథ్ యాత్ర 2026: రేపు తెరుచుకోనున్న ఆలయ ద్వారాలు.. కొత్త నియమాలు ఇవే

ఏప్రిల్ 22న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. భక్తులు పాటించాల్సిన కొత్త నిబంధనలు, హెలికాప్టర్ బుకింగ్ ధరలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Published on: Apr 21, 2026 04:58 PM IST
Advertisement

హిమాలయాల మంచు శిఖరాల మధ్య వేద మంత్రోచ్ఛారణలతో దేవభూమి ఉత్తరాఖండ్ పులకించిపోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న చార్‌ధామ్ యాత్ర 2026 ఇప్పటికే ఘనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన యమునోత్రి, గంగోత్రి ధామాల ద్వారాలు తెరుచుకోగా, ఇప్పుడు అందరి దృష్టి కేదార్‌నాథ్‌పై నిలిచింది. ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు బాబా కేదార్‌నాథ్ ఆలయ తలుపులను భక్తుల దర్శనం కోసం అర్చకులు శాస్త్రోక్తంగా తెరవనున్నారు. దీనికి కొనసాగింపుగా మరుసటి రోజే అంటే.. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ధామం కూడా తెరుచుకోనుంది.

కేదార్‌నాథ్ ఆలయం (PTI)
కేదార్‌నాథ్ ఆలయం (PTI)

ఇప్పటికే బాబా కేదార్‌నాథ్ డోలీ గౌరీకుండ్ నుంచి బయలుదేరి భక్తుల జయజయధ్వానాల మధ్య క్షేత్రానికి చేరుకుంది. అయితే ఈ ఏడాది యాత్రకు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్ నుంచి హెలికాప్టర్ బుకింగ్ వరకు పలు కీలక మార్పులను గమనించాల్సి ఉంటుంది.

కేదార్‌నాథ్ యాత్ర: కఠినమైనా.. అత్యంత ప్రీతిపాత్రం

చార్‌ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ ప్రయాణం అత్యంత కష్టతరమైనదిగా భావిస్తారు. గౌరీకుండ్ నుంచి సుమారు 16 నుంచి 18 కిలోమీటర్ల మేర కొండ మార్గంలో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. శారీరక ఇబ్బందులు ఉన్నవారు, నడవలేని వారి కోసం ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులో ఉంచింది. వీటిని కేవలం ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి. వాతావరణ పరిస్థితులు, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యాత్ర మార్గంలో 177 అంబులెన్స్‌లను సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల కోసం ఎయిమ్స్ రిషికేశ్ ఆధ్వర్యంలో హెలి-అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

హెలికాప్టర్ సర్వీసులు - కొత్త ధరలు ఇవే

ఈ ఏడాది హెలికాప్టర్ ప్రయాణ ధరలను ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి సంస్థ (UCADA) సవరించింది. వివిధ ప్రాంతాల నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు నిర్ణయించిన రౌండ్ ట్రిప్ ధరలు ఇలా ఉన్నాయి:

  • గుప్తకాశీ నుంచి: 12,154
  • ఫాటా నుంచి: 9,680
  • సిర్సీ నుంచి: 6,086

ఆలయ ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడేందుకు ఈసారి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి ఆలయ పరిసరాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. భక్తులు తమ ఎలక్ట్రానిక్ వస్తువులను భద్రపరుచుకోవడానికి ఆలయాల వెలుపల క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించారు. అలాగే, కొన్ని ప్రత్యేక ధామాలలో హిందూయేతర భక్తుల ప్రవేశంపై కొన్ని షరతులు విధించారు. అయితే యమునోత్రిలో మాత్రం అందరికీ ప్రవేశం ఉంటుంది.

రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు తప్పనిసరి

భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రతి యాత్రికుడికి, వాహనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా పేరు నమోదు చేసుకున్న తర్వాతే దర్శనానికి సంబంధించిన టోకెన్లు (స్లాట్లు) జారీ చేస్తారు. వీటిని యాత్ర మార్గంలోని చెక్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తారు. ముఖ్యంగా 55 ఏళ్లు పైబడిన వారు, ఆస్తమా, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు యాత్ర ప్రారంభించే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు.

యమునోత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ పవిత్ర చార్‌ధామ్ యాత్రలో గంగోత్రి, బద్రీనాథ్ క్షేత్రాలు రోడ్డు మార్గంతో అనుసంధానమై ఉండటం వల్ల వృద్ధులకు కాస్త సులువుగా ఉంటుంది. కానీ కేదార్‌నాథ్ వెళ్లేవారు మాత్రం ముందస్తు జాగ్రత్తలతో సిద్ధమవ్వడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe