పుత్రదా ఏకాదశి 2026: పుత్రదా ఏకాదశి రోజు ఈ 4 ప్రదేశాలలో దీపాలు వెలిగిస్తే.. విష్ణువు అనుగ్రహం కలుగుతుంది!
శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి హిందూ ధర్మంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు దీపదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క సమీపంలో, విష్ణు ఆలయంలో లేదా ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించవచ్చు.
శ్రావణ పుత్రదా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం దీపదానం ఎక్కడ, ఏ సమయంలో చేయాలో ఇక్కడ తెలుసుకోండి. గృహస్థులు, వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం పూజా విధానంపై పూర్తి వివరాలు.

శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశికి హిందూ ధర్మంలో విశిష్ట స్థానం ఉంది. ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు దీపదానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరియాలని, మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తులు సాయంత్రం వేళ దీపాలు వెలిగిస్తారు. అయితే ఈ విశేషమైన రోజున ఎక్కడ దీపదానం చేస్తే మంచి ఫలితం ఉంటుందనే విషయాలపై స్పష్టత ఉండటం అవసరం.
శ్రావణ పుత్రదా ఏకాదశి 2026
ఈ ఏడాది శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు అనేదానిపై భక్తులలో స్పష్టత కోసం తిథుల వివరాలు పరిశీలిస్తే, ఆగస్టు 23, 24 తేదీలలో ఈ పర్వదినం వస్తోంది. ఏకాదశి తిథి ఆగస్టు 23 రాత్రి ప్రారంభమై ఆగస్టు 24 ఉదయం వరకు కొనసాగుతుంది.
సాధారణ గృహస్థ సాంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 23న వ్రతం ఆచరిస్తుండగా, వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వారు ఆగస్టు 24న ఏకాదశి వ్రతం నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఏ రోజునైనా భక్తులు విష్ణు పూజతో పాటు దీపదానం నిర్వహించుకోవచ్చు.
తులసి చెంత దీపారాధన
ఏకాదశి సాయంత్రం పూట తులసి మొక్క సమీపంలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమైన ఆచారంగా భావిస్తారు. ముందుగా తులసి అమ్మవారికి జలసమర్పణ చేసి పూజించాలి.
ఆ తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలికించి విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. అయితే తులసి మొక్కకు తగలకుండా కాస్త దూరంగా ప్రమిదను ఉంచడం మంచిది. దీనివల్ల దీపం వేడికి తులసి ఆకులు వాడిపోకుండా ఉంటాయి.
విష్ణు ఆలయాలు మరియు పవిత్ర స్థలాలు
పుత్రదా ఏకాదశి పూర్తిగా జగత్ప్రభువు అయిన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. అందువల్ల సమీపంలోని విష్ణు ఆలయాలకు వెళ్లి దీపదానం చేయడం శ్రేయస్కరం. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలోని నిర్దేశిత ప్రదేశంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. ఆలయాలతో పాటు రావి చెట్టు కింద కూడా దీపాలు వెలిగించే సంప్రదాయం మనవద్ద ఉంది. అయితే చెట్టు కింద ఎండుటాకులు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
ఇంటి పూజా మందిరంలో ఆచరణ
ఒకవేళ ప్రత్యేకంగా బయటకు వెళ్లే అవకాశం లేకపోతే, ఇంట ఉండే పూజా మందిరంలోనే భక్తిభావంతో దీపదానం పూర్తి చేయవచ్చు. సాయంత్రం వేళ విష్ణుమూర్తిని ఆర్చన చేసిన తర్వాత దీపం వెలిగించి కాసేపు దైవ నామస్మరణా చేయాలి. దీపాల సంఖ్య ఎంతనేది ముఖ్యం కాదు, కేవలం భక్తి శ్రద్ధలతో వెలిగించే ఒక్క చిన్న దీపం కూడా సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది.
సమయం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూర్యాస్తమయం అయిన వెంటనే లేదా సాయంత్రం సంధ్యా సమయంలో దీపదానం చేయడం ఆనవాయితీ. ప్రాంతాన్ని బట్టి సూర్యాస్తమయ వేళల్లో మార్పులు ఉంటాయి కాబట్టి స్థానిక పంచాంగాన్ని పరిశీలించి సమయాన్ని నిర్ధారించుకోవడం ఉత్తమం. పవిత్రమైన ఈ రోజున భగవంతుడిని స్మరిస్తూ చేసే దీపదానం జీవితంలో అంధకారాన్ని తొలగించి సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


