ఈనెల 13 నుంచి ‘శ్రావణ మాసం’ స్టార్ట్ - ఇక తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి, భారీగా శుభకార్యాలు

శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో ఏపీ, తెలంగాణల్లో పెళ్లిళ్ల సీజన్ షురూ కానుంది. ఆగస్టు 13 నుంచి నెల రోజుల పాటు శుభ ముహూర్తాలు ఉన్నాయి. భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి.

Published on: Aug 11, 2026, 12:04:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణ మాసం ఆగమనం కోసం ఎదురుచూస్తున్న తెలుగు ఇళ్లలో శుభకార్యాల పర్వం మొదలుకానుంది. శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పల్లెల నుంచి పట్టణాల వరకు వైభవంగా పెళ్లి బాజాలు మోగేందుకు సర్వం సిద్ధమవుతున్నాయి.

ఈనెల 13 నుంచి ‘శ్రావణ మాసం’ స్టార్ట్ (image source Pixel)
ఈనెల 13 నుంచి ‘శ్రావణ మాసం’ స్టార్ట్ (image source Pixel)

ఈనెల 13 నుంచి శుభ ముహూర్తాలు…

ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శుభ ముహూర్తాలు వచ్చే నెల 11వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి. సుమారు నెల రోజుల పాటు అద్భుతమైన ముహూర్తాలు అందుబాటులో ఉండటంతో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు అత్యంత పెద్ద ఎత్తున జరగనున్నాయి. ఈ శ్రావణ సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఆషాఢ మాసం ఉండటంతో ఎలాంటి మంచి ముహూర్తాలు లేక ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మంటపాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు శ్రావణ మాసం ప్రవేశించే సమయం దగ్గరపడటంతో…. ఆ ప్రాంగణాలన్నీ మళ్లీ పెళ్లి సందడితో కళకళలాడనున్నాయి. ఈ శుభకార్యాల రాకతో కేవలం కుటుంబాలలో సంతోషమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. బంగారం, వస్త్రాలు, పూలు, క్యాటరింగ్, ఫంక్షన్ హాళ్లు, మండప అలంకరణ, ఫొటోగ్రఫీ, బ్యూటీ పార్లర్లు తదితర అనుబంధ రంగాల్లో వ్యాపారం భారీగా ఊపందుకోనుంది. ఈ సీజన్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, పెళ్లి అనుబంధ వ్యాపారాల ద్వారా వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరగనున్నాయి.

పెళ్లి లేదా ఏదేని శుభకార్యం అనేది కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఆ వేడుక చుట్టూ అనేక రకాల చిన్నతరహా వృత్తులు, వ్యాపారాలు, కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. వివాహ తేదీ ఖరారైన క్షణం నుంచే వస్త్రాలు, బంగారు నగల కొనుగోళ్లు, ఆహ్వాన పత్రికల ముద్రణ, పూల సప్లై, డెకరేషన్ కాంట్రాక్టులు, క్యాటరింగ్ ఆర్డర్లు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలు, ట్రావెల్స్ బుకింగ్‌లు వేగవంతమవుతాయి. మరోవైపు వధూవరుల కుటుంబాలు బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాల కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ఆభరణాల దుకాణాల్లో వినియోగదారుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది.

పెళ్లి రోజు దగ్గరపడే కొద్దీ క్యాటరింగ్ సిబ్బంది, వంటవాళ్లు, సర్వర్లు, డెకరేషన్ పని చేసే కార్మికులు, మేకప్ ఆర్టిస్టులు, వాహన డ్రైవర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇలా అనేక రంగాల్లో పనిచేసే శ్రామికులకు, చేతివృత్తుల వారికి నిరంతర పని దొరుకుతుండటంతో శ్రావణ మాసాన్ని ఒక ప్రధాన ఉపాధి కల్పించే సీజన్‌గా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాల నిర్వహణకు ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 మరియు సెప్టెంబరు 3, 4, 5, 8, 10, 11 తేదీలు అత్యంత అనుకూలమైన మంచి రోజులుగా పురోహితులు సూచిస్తున్నారు. వధువరూల జాతకాలు బట్టి… మంచి రోజులు నిర్ణయిస్తారు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More