మాఘ మాసం ఎందుకు ప్రత్యేకం? ఈ నెలలో నదీ స్నానం ఎందుకు చెయ్యాలో తెలుసుకోండి!

తెలుగు నెలల్లో పదకొండవ నెల మాఘ మాసం. జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నది స్నానం. అయితే ఈ చలిలో నదిలో ఎందుకు స్నానం చేయాలి? దీని వెనుక పరమార్థం ఏంటి? ఇది కేవలం నమ్మకమా, లేక ఆరోగ్య రహస్యమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jan 21, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మాఘ మాసం అత్యంత పవిత్రమైన మాసం. తెలుగు నెలల్లో పదకొండవ నెల. జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నది స్నానం. అయితే ఈ చలిలో నదిలో ఎందుకు స్నానం చేయాలి? దీని వెనుక పరమార్థం ఏంటి? ఇది కేవలం నమ్మకమా, లేక ఆరోగ్య రహస్యమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ మాసంలో మాఘ స్నానం (pintererst)
మాఘ మాసంలో మాఘ స్నానం (pintererst)

మాఘ మాసంలో మాఘ స్నానం

మాఘ మాసంలో మాఘస్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటారు. మాఘ మాసంలో నది స్నానం చేస్తే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. పాపాలన్నీ తొలగిపోతాయి, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరించినప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను కలిగి ఉంటాయి. అందుకే మాఘ మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

దైవ శక్తి

ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం శ్రేష్ఠం. మాఘ మాసంలో నదీ జలాలన్నీ దైవ శక్తిని కలిగి ఉంటాయని విశ్వాసం. అందుకే చాలా మంది ప్రతిరోజూ నది స్నానం చేస్తారు. ఒకవేళ అలా కుదరకపోతే కనీసం మాఘ పౌర్ణమి నాడైనా నది స్నానం చేస్తారు. అలా చేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాగే తెల్లవారుజామున నది స్నానం చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా చెబుతారు.

మాఘ మాసంలో స్నానం ఎలా చేయాలి?

మాఘ మాసంలో నదిలో స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ఇంట్లోనే నదులను స్మరిస్తూ స్నానం చేయవచ్చు. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, దీప దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మాఘ స్నానం చేస్తే శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు, ఆత్మను కూడా పవిత్రం చేయవచ్చు.

సూర్య ఆరాధన

మాఘ మాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్యుడు ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. తెల్లవారుజామున నిద్ర లేచి, ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేసి, సూర్య మంత్రాలను జపిస్తారు. ఎరుపు రంగు పూలు, ఆవు నెయ్యి దీపాలతో సూర్య భగవానున్ని ఆరాధిస్తారు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వలన రోగ భాధలు తొలగిపోతాయి. శత్రు, రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందవచ్చని చెబుతారు.

ఏకాదశి, మాఘ పౌర్ణమి

మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఆ రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ చేసి, ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. మాఘ పౌర్ణమికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని మహా మాఘి అని అంటారు. ఆ రోజున దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని విశ్వాసం. అందుకని మాఘ మాసం మొత్తం నది స్నానం చేయడం కుదరకపోతే, కనీసం ఆ ఒక్క రోజైనా నది లేదా సముద్ర స్నానం చేయడం మంచిదని చెబుతారు.