ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Dec 10, 2025 2:17 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసింది. ఉన్నత విద్యా శాఖ ద్వారా పరిపాలనా అనుమతి జారీ అయింది. ఉన్నత విద్యా శాఖ ఈ మొత్తానికి పరిపాలనా ఆమోదం తెలిపింది, ఈ నిధులు ఓయూ క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగుదల కోసం మాత్రమే ఉద్దేశించినవని ప్రభుత్వం పేర్కొంది. మంజూరైన మొత్తాన్ని వినియోగించుకోవడానికి తదుపరి చర్యలు ప్రారంభించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వు జారీ అయ్యాయి.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. హాస్టళ్ల ఆధునీకరణ, అకడమిక్ బ్లాక్స్ నిర్మాణం, విద్యార్థుల సౌకర్యాలు, ఇతర పనులకు ఈ నిధులను ఉపయోగిస్తారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఓయూకి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేసినట్టుగా తెలిపారు. ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వరాష్ట్ర ఆకాంక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం బలంగా వినిపించిందని గుర్తు చేశారు.

'భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఓయూకు వచ్చాను. గతంలో ముఖ్యమంత్రులను అడ్డుకున్న చరిత్ర ఉంది. మీరు ఎందుకు ఓయూకు వెళ్లే ధైర్యం చేస్తున్నారని కొందరు నాతో అన్నారు. ధైర్యంతో కాదు.. విద్యార్థుల గుండెల నిండా ఉన్న అభిమానంతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చాను. ప్రసంగాలు చదవుకుని కాదు.. నా మనసులో ఉన్నది చెప్పాలని ఇక్కడకు వచ్చాను. మీరు ఇచ్చే సూచనలు, మేధావులు ఇచ్చే సలహాలతో ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతాను. విద్యార్థులకు మా ప్రభుత్వం అండగా ఉండాలనే ఆలోచనతో ఇక్కడి వచ్చా.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.