అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - నల్గొండకు చెందిన విద్యార్థిని దుర్మరణం, తీవ్ర విషాదంలో కుటుంబం
Telangana Student Killed US : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన విద్యార్థిని నవ్య (24) చికాగో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. పార్ట్ టైమ్ జాబ్ ముగించుకుని వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Telangana Student Killed US : ఉన్నత చదువులు చదివి, మంచి భవిష్యత్తును అందుకుంటుందని ఆశించిన ఆ ఇంటి కుమార్తె అమెరికా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందింది. మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) చదివేందుకు అమెరికా వెళ్లిన నవ్య (24) అనే విద్యార్థిని శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.నవ్య… తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన నివాసి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... నవ్య రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్ళింది. శనివారం రాత్రి ఆమె తన పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ దారుణమైన ప్రమాద వార్తను అమెరికాలో ఉంటున్న నవ్య స్నేహితులు మొదటగా నల్గొండలోని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
"మా అమ్మాయి నవ్య ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. ఈ ఘోర ప్రమాదం గురించి ఆమె స్నేహితులు మాకు సమాచారం అందించారు. పార్ట్ టైమ్ జాబ్ ముగించుకుని వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని చెప్పారు. ఈ విషయాన్ని మేము మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు యూఎస్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నారు," అని నవ్య కుటుంబ సభ్యుడు ఒకరు కన్నీరుమున్నీరవుతూ వివరించారు.
ఈ ప్రమాదంలో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మొదట స్థానిక ఆసుపత్రులకు తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం చికాగో ఏరియాలోని పెద్ద ఆసుపత్రులకు తరలించారు.
భారత రాయబార కార్యాలయం సంతాపం
చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మరణించిన విద్యార్థిని నవ్య గడుసు కుటుంబానికి, స్నేహితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. "చికాగో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నవ్య గడుసు మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాన్సులేట్ అధికారులు బాధిత కుటుంబంతో నిరంతరం టచ్లో ఉన్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న అక్కడి స్నేహితులు, కమ్యూనిటీ సభ్యులతో కూడా మేము సంప్రదింపులు జరుపుతున్నాము," అని కాన్సులేట్ అధికారికంగా ప్రకటించింది.
మంత్రి కోమటిరెడ్డి దిగ్భ్రాంతి
నవ్య మృతిపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. ఎం.ఎస్ పూర్తి చేసి ఉన్నత ఆశయాలతో ఉన్న నవ్య అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నవ్య భౌతికకాయాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అమెరికాలోని తానా, ఆటా ప్రతినిధులతో మాట్లాడి చర్యలు చేపడుతున్నాను. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది” అని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

