ఇంటికి పిలిచి, బ్యాట్తో కొట్టి....! ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య, వెలుగులోకి అసలు విషయాలు
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం వెలుగు చూసింది. కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో శ్రవణ్ సాయి (20) అనే యువకుడిని యువతి తరఫు బంధువులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అత్యంత దారుణం వెలుగు చూసింది. బీటెక్ విద్యార్థిపై దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య (representative image )
ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి(19) అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వేర్వేరు చోట్ల చదువుకుంటున్నప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే వీరిద్దరూ టెన్త్ వరకు ఒకే చోట చదువుకున్నట్లు తెలిసింది.
వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. ఆ తర్వాత ఇరువురినీ పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. అయినా వినిపించుకోకపోవడంతో మంగళవారం రోజున శ్రవణ్ సాయిని పెళ్లి చేస్తామని నమ్మించి…. మాట్లాడదాం రమ్మని యువతి కుటుంబసభ్యులు ఇంటికి పిలిపించారు.
ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించి దాడి చేశారు. క్రికెట్ బ్యాట్ తో దాడికి దిగారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రవణ్ సాయి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
వెలుగులోకి కీలక విషయాలు..!
యువకుడి హత్య కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులోని యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో యువతి తల్లి ద్వారా కీలక విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి గర్భం దాల్చినట్లు తెలిసింది. ఇదే విషయంపై వాగ్వాదం జరగగా… కూతుర్ని కొడుతుంటే శ్రవణ్ సాయి మధ్యలోకి అడ్డంగా వచ్చాడని వెల్లడించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అసలు సాయి శ్రవణ్ ను ఎవరు ఇంటికి రప్పించారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరికొన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.