రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద విద్యార్థులకు వరంగా మారిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడింది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ను నిర్వహించనున్నట్లు ఏబీవీపీ ప్రకటన చేసింది.

ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వస్తోందని ఏబీవీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది విద్యార్థుల విద్యా హక్కును కాలరాయడమేనని వారు విమర్శించారు.
ఒకవైపు ఫీజులు అందక, మరోవైపు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక వేలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న ఈ దోబూచులాటలో అమాయక విద్యార్థులు బలిపశువులుగా మారుతున్నారని నాయకులు మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఇలాంటి కీలకమైన పథకానికి నిధులు విడుదల చేయకుండా ఆలస్యం చేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఏబీవీపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
తక్షణమే బకాయిలు విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈనెల 14న చేపట్టే కాలేజీల బంద్ను విజయవంతం చేసి… ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.