...
...
Next Story

'రైతు భరోసా స్కీమ్' పై కీలక ప్రకటన - 'శాటిలైట్ మ్యాపింగ్' ఎందుకోసమంటే..?

రైతు భరోసా స్కీమ్ బంద్ అంటూ వచ్చిన వార్తలపై వ్యవసాయశాఖ స్పందించింది. ఇలాంటి అసత్యమైన వార్తలను నమ్మవద్దని కోరింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందేలా చూసుకోవడానికి జిల్లా కమిటీలు గ్రౌండ్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయని పేర్కొంది.

Published on: Dec 26, 2025, 16:52:45 IST
The Economist
Advertisement

రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వివరణలతో కూడిన ప్రకటనను విడుదల చేసింది.

రైతు భరోసా స్కీమ్
రైతు భరోసా స్కీమ్

రైతు భరోసా కింద తెలంగాణ వ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారని వ్యవసాయశాఖ పేర్కొంది. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదని… నిలిపివేయడం లేదని వివరించింది. ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అందేలా చూసుకోవడానికి గ్రౌండ్ వెరిఫికేషన్ ను నిర్వహిస్తున్నాయని వెల్లడించింది.

ఆర్ధిక శాఖ కూడా లబ్ధిదారులకు చెల్లింపులు చేయడం కోసం వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తోంది. రైతు భరోసా నిలిపివేస్తున్నారని అని ప్రచారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.

శాటిలైట్ మ్యాపింగ్ పై వివరణ

వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఆ జాబితా నుండి తొలగించడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సహాయంతో 'శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది. 2024 సంవత్సరంలో నిర్వహించిన ఒక గ్రౌండ్ సర్వే ప్రకారం 4 లక్షల ఎకరాల భూమి… ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది.

ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుని దగ్గర ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందొ నిర్దారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచరా, కొండ, రోడ్ లేదా ఫామ్ హౌస్ అని ధృవీకరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న భూములు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సహాయం పొందడానికి అర్హత కలిగినవి కావు. మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఫీల్డ్ డేటాను రికార్డులతో ధృవీకరించడానికి మాత్రమే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe