...
...
Next Story

అమీన్‌పూర్ SEZ వివాదం.. సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఊరట

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ)పై ఓమిక్స్ ఇంటర్నేషనల్‌కు ఉపశమనం దక్కింది. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన స్టే ఆర్డర్‌ను కొనసాగించాలని ఆదేశించింది.

Published on: Jun 17, 2026, 20:05:39 IST
Advertisement

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి(SEZ) డీ-నోటిఫికేషన్ వ్యవహారంలో ప్రముఖ సంస్థ 'ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్'కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఈ వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర రక్షణను (స్టే ఆర్డర్) సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్కర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పరిశీలించిన బెంచ్.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది. దీనితో వివాదాస్పద అమీన్‌పూర్ సెజ్ భూములకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగనుంది.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామంలోని 4.05 హెక్టార్ల ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పూర్తిగా డీ-నోటిఫై చేయాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘స్పెషల్ ఎకనామిక్ జోన్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్’ ప్రతిపాదించింది. 2025 జూలై 18న జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్ 130వ సమావేశంలో ఈ మేరకు అజెండా అంశం నం. 130.13 కింద డీ-నోటిఫికేషన్ నిర్ణయాన్ని ఆమోదించారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓమిక్స్ ఇంటర్నేషనల్ మొదట తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ అజెండా అంశం అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే మంజూరు చేసింది. తమకు ఇప్పటికే మంజూరైన అధికారిక అనుమతులకు విరుద్ధంగా కేంద్ర బోర్డు ఏకపక్షంగా ఈ డీ-నోటిఫికేషన్ నిర్ణయం తీసుకుందని ఓమిక్స్ ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు ముందు వాదించింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వుల పట్ల ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఎస్ఈజెడ్ విధానాల ఆశయాలకు కట్టుబడి తాము ఐటీ/ఫార్మా/అభివృద్ధి రంగాల్లో అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో తమ న్యాయపరమైన వాదనలను సమగ్రంగా వినిపించి న్యాయం పొందుతామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రతివాదులు తమ కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe