హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నది వెనుక భాగంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం ఏడు దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి దాదాపు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ వెల్లడించారు. "చాదర్ఘాట్ పరిధిలోని మూసీ నది వెనుక వైపు అగ్నిప్రమాదం జరిగినట్లు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మాకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనులను ప్రారంభించారు.
ఏడు దుకాణాలు దగ్ధం…
ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు ఏడు దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. వీటిలో కార్ల మరమ్మతు దుకాణాలు (కార్ రిపేర్ షాప్స్), ఫంక్షన్ హాళ్లకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి విక్రయించే షాపులు ఉన్నాయి. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు" అని డీసీపీ వివరించారు.
ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ ఖారే కిరణ్ కీలక విజ్ఞప్తి చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతామని…. ఎవరూ కూడా సోషల్ మీడియాలో గానీ, బయట గానీ ఎలాంటి తప్పుడు వార్తలను, వదంతులను వ్యాప్తి చేయవద్దని కోరారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.