టాప్ గేరులో ప్రధాన పార్టీల ప్రచారం - ఆసక్తికరంగా ‘జూబ్లీహిల్స్’ బైపోల్ వార్...!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రచారంలో టాప్ గేర్ వేయగా…. ఓటర్లను ఆకర్షించే దిశగా అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. 

Published on: Nov 5, 2025, 10:13:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేసే పనిలో ఉన్నాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలను మోహరించగా… మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో ప్రచార వేడిని పెంచుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగులు పేలుతుండగా… మరోవైపు బీజేపీ నేతలు ఆ రెండు పార్టీలను కార్నర్ చేస్తూ ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారు.

జోరుగా ఉపఎన్నికల ప్రచారం
జోరుగా ఉపఎన్నికల ప్రచారం

ప్రధాన పార్టీలకు సవాల్….!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ విజయం ఎంతో అవసరమన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కానీ సీన్ రివర్స్ అయితే... ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న సంకేతాలు మరింత బలపడుతాయి. ఈ పరిణామం కాస్త ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ఈ ఉపఎన్నిక రెఫరెండంగానే భావించవచ్చన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలో గెలవలేకపోతే అది ఆ పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం చూపడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూబ్లీహిల్స్ గెలిచి నగరంలో పట్టు పెంచుకోవటంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సరైన బదులివ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ తో పాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇవ్వాలని… నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చూసి చూపిస్తామని కోరుతున్నారు.

కేటీఆర్ రోడ్ షోలు….

ఇక్కడ సీటు గెలవటమనేది బీఆర్ఎస్ కు అత్యంత ముఖ్యంగా మారిపోయింది. ఎందుకంటే ఇది వారి సిట్టింగ్ స్థానం. వరుసగా ఇక్కడ విజయాలు సాధించిన బీఆర్ఎస్... ఈ ఉపఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవైపు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గెలిస్తేనే... అధికార కాంగ్రెస్ పై మరింత పోరాడేందుకు స్కోప్ దొరికే అవకాశం స్పష్టంగా ఉంటుంది.

మాగంటి గోపినాథ్ సతీమణికే టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రంతో పాటు నియోజకవర్గంలోని ప్రజాసమస్యలను ప్రధానంగా తెరపైకి తీసుకువస్తోంది. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో జనాల్లోకి వెళ్తోంది. హైడ్రా కూల్చివేతలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.... ప్రజామద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్.. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇక్కడే మోహరించగా… ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు.

వేగం పెంచిన బీజేపీ…!

మరోవైపు బీజేపీ కూడా ప్రచారంలో వేగం పెంచింది. కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. కార్పెట్‌ బాంబింగ్‌ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీలోని కీలక నేతలంతా కూడా ప్రచారంలో ఉంటున్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదని… ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కూడా విఫలమైందని కమలం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమకు అవకాశమిస్తే…. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో భాగం కానున్నారు.

నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ తో పాటు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణ కేంద్రం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More