కవిత టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ కౌంటర్.. డూప్లికేట్ ప్రోడక్ట్స్ పోల్చుతూ సోషల్ మీడియా పోస్ట్!
Kavitha TRS Party Memes : కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.
కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటిస్తూ.. జెండాను కూడా విడుదల చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా ఉన్న ఇప్పటి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) తన సోషల్ మీడియా ఖాతాలో కవిత కొత్త పార్టీపై మీమ్ వదలింది.

మార్కెట్లో ఎక్కువగా ఉపయోగించే ఓ కంపెనీకి చెందిన వాటర్ బాటిల్, టూత్ పేస్ట్ మీద వచ్చిన డూప్లికేట్ ప్రోడక్ట్స్తో కవిత పార్టీని పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ వైరల్ చేస్తున్నారు. నేరుగా కవిత పార్టీ పేరును ప్రస్తావించకపోయినా.. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని పోస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ.
మేడ్చల్లోని మునీరాబాద్లోని ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) పార్టీని కవిత ప్రకటించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 12 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలను గుర్తుచేసుకున్నారు. గతంలో కొన్ని తప్పులు జరిగాయని, ఆ తప్పులలో నేను కూడా భాగమేనని చెప్పారు కవిత. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూస్తానని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా అన్నారు.
అపారమైన పోరాటం నుండి పుట్టిన ఒక నూతన రాజకీయ శక్తిగా తెలంగాణలో ఒక కొత్త విప్లవం ప్రారంభమైందని కవిత అన్నారు. ఈ రోజు మరచిపోలేనిదని అభివర్ణిస్తూ, రాష్ట్ర భవిష్యత్తును సురక్షితం చేయడానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆశయం కోసం పడిన కష్టాలను, చేసిన పోరాటాలను కవిత గుర్తుచేసుకున్నారు. ఈ ఉద్యమ సమయంలో కోల్పోయిన ప్రాణాలతో సహా చేసిన త్యాగాలను ప్రస్తావించారు.
టీఆర్ఎస్తో కలిసి ప్రజల ముందుకు వస్తున్నా అన్నారు కవిత. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ కవిత బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నారని ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన ఐదు గ్రామాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


