Sign in

Kavitha TRS party: తెలంగాణలో మరో టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటించిన కవిత

Kavitha TRS party: తెలంగాణలో మరో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్‌గా ప్రకటించారు.

Updated on: Apr 25, 2026, 15:28:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kavitha new party name: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఏప్రిల్ 25, 2026 మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌ వద్ద నిర్వహించిన సభలో ఆమె తన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్‌)గా ప్రకటించారు.

కొత్త పార్టీ ప్రకటించిన కవిత
కొత్త పార్టీ ప్రకటించిన కవిత

అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ కోసం అనేక కష్టాలు పడి, పిడికిలి బిగించి కొట్లాడామని చెప్పారు. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు తెగుతాయని భావించాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, దళితులు దెబ్బలు తిన్నారని కవిత విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత స్వేచ్ఛ లేని నిఘా నీడలో తెలంగాణ బతికిందని, ఫోన్లు ఎక్కడ ట్యాప్ అవుతున్నాయో అన్న భయం వెంటాడిందని విమర్శించారు. 'ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగమే. జరిగిన కొన్ని విషయాలకు నేను సిగ్గుపడుతున్నాను. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలని కోరుతున్నాను.' అని కవిత వ్యాఖ్యానించారు.

బీఆర్‌ఎస్‌కు 'ఆత్మ' లేదు.. అందుకే 'టీఆర్‌ఎస్' పుట్టింది!

పార్టీ మార్పుపై స్పందిస్తూ.. 'ఏ పార్టీకైనా ఒక ఆత్మ, ఒక నేపథ్యం ఉండాలి. బీఆర్‌ఎస్ సాంకేతికంగా ఉన్నా, అది తన ఆత్మను కోల్పోయింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైంది. అందుకే, ఆ కోల్పోయిన ఆత్మను వెతుక్కుంటూ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) ప్రజల ముందుకు వచ్చింది.' అని కవిత స్పష్టం చేశారు.

రాజకీయ అధికారమే లక్ష్యం

ప్రజలకు కేవలం పోరాటాలతోనే న్యాయం జరగదని, అందుకు రాజకీయ అధికారం తోడు కావాలని కవిత అభిప్రాయపడ్డారు. పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ప్రజల ముందుకు వచ్చిందన్నారు. తన పని తీరు ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, బతుకమ్మ సంస్కృతిని కాపాడుకున్న జాగృతి కార్యకర్తలే తన కొత్త ప్రస్థానానికి వెన్నుముక అని చెప్పారు.

తెలంగాణ తెచ్చుకున్న కలలు నిజం కాలేదని కవిత విమర్శలు గుప్పించారు. ఆ తప్పులో తనకూ భాగం ఉంది కాబట్టే.. కేవలం క్షమాపణ చెబితే సరిపోదని కవిత అన్నారు. సామాజిక న్యాయం కోసం మళ్లీ నడుం బిగించి పని చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ తన జీవితంలో మరిచిపోలేని రోజు అవుతుందని కవిత గుర్తుచేసుకున్నారు. తెలంగాణ భవిష్యత్‌ రాసుకోవడానికి మనందరి భాగస్వామ్యం కావాలన్నారు. తెలంగాణ సాధించినందుక చాలా గర్వపడుతున్నానని, జన్మధన్యమైందని భావిస్తున్నా అన్నారు.

పేరు బయటకు రాకుండా చూసుకున్న కవిత

తెలంగాణ ఉద్యమ కాలం జాగృతి నడిపించిన కల్వకుంట్ల కవిత కవిత, ఇప్పుడు కొత్త జెండా ఎత్తుకున్నారు. కార్యకర్తల ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగంలో బీఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేశారు. నిజానికి కొన్ని రోజులుగా బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మారుస్తారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన పార్టీ పేరు బయటకు రాకుండా చూసుకున్నారు. ఏవేవో పేర్లపై లీకులు బయటకు వచ్చాయి. చివరకు కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్)గా ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More