...
...
Next Story

MLC Tata Madhu : స్పీకర్‌పై ఘోరమైన కామెంట్స్ కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

MLC Tata Madhu : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Sep 8, 2026, 09:11:08 IST
Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మెుదటి రోజున గందరగోళం నెలకొన్నది. అసెంబ్లీ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు వేసుకుని వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని లోపలకు వెళ్లనివ్వలేదు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద ఆందోళన వ్యక్తమైంది. ఈ గందరగోళం మధ్య తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేశారు.

ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

స్పీకర్‌ను కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించారని ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి మధును, కోకాపేటలోని ఆయన నివాసం నుండి నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం వీరిద్దరినీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ తరలించారు.

ఈ వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన హోదాపై వ్యక్తిగత, అభ్యంతరకరమైన దాడులను అనుమతించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

ఈ పరిణామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణకు దారితీశాయి. ప్రభుత్వం తమ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని ప్రతిపక్షం ఆరోపించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం స్పష్టం చేసింది. విచారణలో భాగంగా పోలీసులు ఎమ్మెల్సీలను ప్రశ్నిస్తున్నారు, అలాగే ఆరోపించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను పరిశీలిస్తున్నారు.

ఒక దళిత వర్గానికి చెందిన నేత స్పీకర్ స్థానంలో ఉండటం ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు జుగుప్సాకరమైన భాషను ఉపయోగించారని, కేసీఆర్ మొదటి నుంచీ దళిత వ్యతిరేకి అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తాననడం, మూడెకరాల భూమి ఇస్తామనడం అంతా మోసమేనని మండిపడ్డారు. స్పీకర్ పట్ల అపచారంగా ప్రవర్తించిన తాతా మధును పదవి నుంచి డిస్మిస్ చేయడంతో పాటు, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ ఘటనపై తెలంగాణ ప్రజలకు, స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ తాతా మధు మాటలను ఖండిస్తూ.. మంత్రి సీతక్క మాట్లాడారు. స్పీకర్ తల్లిని అవమానించడం బాధకరమని అన్నారు. ఈ సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు.

అసెంబ్లీ సమావేశాల మెుదటి రోజున జరిగిన గందరగోళంలో భాగంగా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. అప్ కార్యకర్త హేమచంద్రపై పెట్రోల్ పోసి కొని హంగామా చేసినందుకు కూడా కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్త గణేష్ పైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీస్ అధికారులపై దారులు చేసి దూషించినందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్, కేటీఆర్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదు అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe