తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్ - 2025) ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. పరీక్షలు నిర్వహించి 2 నెలలు దాటినప్పటికీ… ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని… వెంటనే ఫలితాలను ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత సాధించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన ఈ పరీక్షను 18 కేంద్రాల్లో వీటిని నిర్వహించగా… సుమారు 80 శాతం మంది పరీక్ష రాశారు.
టీజీ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను త్వరగానే ప్రకటించారు. జనవరి నెలలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించారు. ఈ గడువు కూడా చాలా రోజుల కిందటే పూర్తి అయింది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయినప్పటికీ…. ఇంకా ఫలితాలు రాకపోవటంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఫలితాలు ఎప్పుడు..?
టీజీ సెట్ ఫలితాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు టీజీ సెట్ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మెరిట్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.