...
...
Next Story

ఘోరం.. హాస్టల్ వాష్‌రూమ్‌లో ప్రసవం.. శిశువును వెంటిలేటర్ నుంచి కిందకు పడేసిన యువతి

హైదరాబాద్‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి హాస్టల్ వాష్‌రూమ్‌లో ప్రసవించింది. శిశువును వెంటిలేటర్ నుంచి కిందకు విసిరేసింది.

Published on: Jun 24, 2026, 16:16:04 IST
Advertisement

హైదరాబాద్ మహానగరంలో గుండెల్ని పిండేసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ఉమెన్స్ హాస్టల్‌లో ఓ యువతి బిడ్డను ప్రసవించింది. ఆపై నవజాత శిశువును వెంటిలేటర్ గుండా బయటకు విసిరేసి ప్రాణాలు తీసింది. సమాజంలో నైతిక విలువల పతనాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది.

హాస్టల్ వాష్‌రూమ్‌లో ప్రసవం
హాస్టల్ వాష్‌రూమ్‌లో ప్రసవం

పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతి గోల్కొండ పరిధిలోని ఒక హాస్టల్‌లో నివాసముంటోంది. అయితే ఆమె గర్భం దాల్చిన విషయాన్ని హాస్టల్ నిర్వాహకులు గానీ, తోటి రూమ్‌మేట్స్ గానీ గమనించలేకపోయారు. తీవ్రమైన ప్రసవ వేదన రావడంతో సదరు యువతి హాస్టల్ వాష్‌రూమ్‌కు వెళ్లింది. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది.

ఎవరికి ఏం సమాధానం చెప్పాలనే భయమో, లేక చేసిన తప్పు బయటపడుతుందనే ఆందోళనో గానీ.. పురిటి నొప్పుల బాధలో ఉంటూనే.. అప్పుడే పుట్టిన పసికందును వాష్‌రూమ్ వెంటిలేటర్ కిటికీలోంచి కిందకు విసిరేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ దారుణ సంఘటన జరిగిన తర్వాత తీవ్ర రక్తస్రావం కావడం, యువతి అస్వస్థతకు గురికావడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు యువతిని చికిత్స నిమిత్తం నగరంలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంది. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పంపారు.

విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె గర్భం దాల్చిన విషయం తమకు తెలియదని, ఆమె బావ వల్లే ఈ గర్భం వచ్చి ఉండవచ్చని వారు గట్టిగా అనుమానిస్తున్నారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం, ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్రమైన డిప్రెషన్‌కు గురికావడం వల్లే యువతి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe