సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేత: జీహెచ్‌ఎంసీ కీలక ఉత్తర్వులు

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) తన పరిధిలోని మాంసం దుకాణాలను సెప్టెంబర్ 4న మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

Published on: Sep 2, 2026, 15:01:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాంసం విక్రయాలపై కీలక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 4వ తేదీన నగరంలోని మేకలు, గొర్రెల వధశాలలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ పూర్తిగా మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు బంద్
సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు బంద్

ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 533(b) ప్రకారం కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పవిత్రమైన శ్రీకృష్ణాష్టమి పండుగ రోజున ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవిస్తూ, నగరంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఈ మూసివేత ఉత్తర్వులను నగరంలో అత్యంత కఠినంగా అమలు చేయడానికి వీలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల సహకారాన్ని జీహెచ్‌ఎంసీ కోరింది. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ కమిషనర్లు, స్థానిక పోలీసులు.. మున్సిపల్ అధికారులకు పూర్తి స్థాయి సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు.

సెప్టెంబర్ 4న ఉదయం నుంచే నగరంలోని అన్ని సర్కిళ్లలో జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్థానిక పోలీసులు కలసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. నిబంధనలను ఉల్లంఘించి దొంగచాటుగా మాంసం విక్రయించినా, వధశాలలు నిర్వహించినా సదరు షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా విక్రయించే మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, వ్యాపారులపై భారీగా జరిమానాలు విధించడం, షాపుల లైసెన్సులను రద్దు చేయడం వంటి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న మాంసం వ్యాపారులు, చికెన్, మటన్, బీఫ్ షాపుల యజమానులు, వధశాలల నిర్వాహకులు ఈ ఉత్తర్వులను గౌరవించి పూర్తి స్థాయిలో సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నగర ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి, పండుగ రోజున తగిన విధంగా సహకరించాలని కోరారు.

పండుగల సమయాల్లో, విశిష్టమైన ఆధ్యాత్మిక దినాలలో జంతు వధను నిరోధించడం, శాంతిభద్రతల పరిరక్షణ, నగర పరిశుభ్రతను కాపాడటంలో భాగమేనని అధికారులు తెలిపారు. కృష్ణాష్టమి వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆకాంక్షించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More