...
...
Next Story

TGSRTC Strike : ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి.. శుక్రవారం మంత్రులతో చర్చలు

Telangana RTC Strike : తెలంగాణలో ఆర్టీసి కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.

Published on: Apr 23, 2026, 19:18:40 IST
Advertisement

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక లోకం అట్టుడుకుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో మరింత ఆందోళన పెరిగింది. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టిన కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. "కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు" అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ప్రతి కార్మికుడి శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మికులతో ముఖాముఖి భేటీ కానుంది.

మరోవైపు, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తగ్గేదే లేదని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈయూ ఆఫీసులో సమావేశమైన జేఏసీ నేతలు వెంకన్న, థామస్‌రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు:

24న: అన్ని డిపోల ముందు 'మౌన ప్రదర్శన'.

25న: డిపోల్లోనే 'వంటా-వార్పు'.

26న: జిల్లాల వారీగా 'కార్మిక కవాతు'.

27న: ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు.. మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో 'బతుకమ్మ నిరసన'.

29న: డిపోల ముందు 'అర్ధనగ్న ప్రదర్శనలు'.

ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఒక సానుకూల పరిణామం అయితే.. జేఏసీ ప్రకటించిన వరుస నిరసనలు ఉత్కంఠను రేపుతున్నాయి. మంత్రుల కమిటీ చర్చల తర్వాత ఆర్టీసీలో సమ్మె నీడలు తొలగిపోతాయా? లేదా నిరసనలు మరింత కొనసాగుతాయా? అన్నది వేచి చూడాలి.

డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. నర్సంపేట బస్టాండ్ ఎదుట శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనను వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.

శంకర్ గౌడ్‌కు తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వంలో విలీనాన్ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. పలు డిపోల వద్ద ప్రదర్శనలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యూనియన్లు, జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. దీంతో తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో అంతరాయం కలిగింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రభుత్వ యంత్రాంగంతో వారాల తరబడి జరిపిన చర్చలు విఫలమైన తర్వాత సమ్మెకు పిలుపునిచ్చారు. జేఏసీ 32 డిమాండ్లను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఇందులో 29 డిమాండ్లు ఓకే.. మిగిలినవాటి గురించి చర్చిద్దామని చెబుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe