3 కేటగిరీలుగా పెట్టుబడుల కంపెనీలు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Review On Investment MoUs : దావోస్ , తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదిరిన పెట్టుబడి ఒప్పందాలను వేగంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కంపెనీలకు భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనపై దిశానిర్దేశం చేశారు.
CM Revanth Reddy Review : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని కేవలం ఒప్పందాలకే పరిమితం చేయకుండా, వాటిని క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ అంతర్జాతీయ వేదికలపై ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు త్వరితగతిన అమలు కావాలన్నారు. ఇందుకోసం కంపెనీలకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను యుద్ధప్రతిపాదికన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పలు కంపెనీలతో కుదిరిన ఎంవోయూలు కార్యరూపం దాల్చడంలో ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
కేటగిరీలుగా విభజించండి - సీఎం
పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. వివిధ రంగాలలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను తెలిపారు.
అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసి వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ఫ్యూచర్ సిటీలో కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏయే ఎంవోయూలు ఎప్పుడు కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమలుకు ఉన్న ఆటంకాలు, వాటి పెట్టుబడులు, ఆ సంస్థలు కల్పించే ఉద్యోగాల వంటి అన్ని వివరాలు సీఎంఓ, ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా రియల్ టైమ్ అప్డేట్స్తో డ్యాష్బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు.
పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాలన్నారు. టైర్-2, టైర్-3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

