తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్మ్యాప్, పాలసీ డాక్యుమెంట్ కనిపించాలని చెప్పారు.

రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా మూడు ప్రాంతాలుగా విభజించుకోవాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ది, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా విజన్ 2047కు సిద్దమౌతోందన్నారు. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్దే టార్గెట్గా రానున్న 22 ఏంఢ్ల కార్యాచరణను డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ఆవిష్కరించబోతోందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 (Telangana Rising Global Summit 2025) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో పాలసీ డాక్యుమెంట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా…. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
- "తెలంగాణలో పెట్టుబడులకు ఉన్నఅపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఆవిష్కరించడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ రెండు రోజుల్లో సదస్సులో ప్రభుత్వం ప్రధానంగా వివరిస్తుంది.
- "హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణను మూడు జోన్లుగా అభివృద్ది సమతుల్యత సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్లో భాగమవుతుంది.
- ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI), స్టార్టప్, MSMEలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాల్లో రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలకమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
- బ్లూ మరియు గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్లో మూసీ పునరుజ్జీవం, దీనిలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుంది.
- ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డు, హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లు, రీజినల్ రింగ్ రైల్, 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతోంది.
- ప్రతీ ఏడాది రెండు లక్షల యువతకు, లక్షమంది నిపుణులకు విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ది టార్గెట్గా ప్రణాళికల రూపకల్పన, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీల నిర్మాణం, మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు అంశాల్లో స్పష్టమైన భవిష్యతు ప్రణాళికలు రూపొందించారు.
- అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ది, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పించారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు.