బాసరలోని పవిత్ర జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల 6వ తేదీన శంకుస్థాపన..

నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం రూ. 225 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించగా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఈనెల 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని…. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.
తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో భాగంగా బాసరను ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా…. పర్యావరణహిత క్షేత్రంగా తీర్చిదిద్దుతారు. భవిష్యత్తులో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రోడ్లు, అధునాతన క్యూ కాంప్లెక్స్లు, ఘాట్ల విస్తరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తారు.
మాస్టర్ ప్లాన్ లో భాగంగా…. ఆలయ గర్భాలయం, రాజగోపురాలు, మడ వీధులతో పాటు భక్తుల వసతి సౌకర్యాలను అత్యాధునికంగా అభివృద్ధి చేస్తారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయ కారిడార్ను పర్యాటక హబ్గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంతేకాకుండా గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తారు.