ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి కఠిన చట్టం - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. 

Published on: Jul 18, 2026, 18:36:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు సిద్ధమయ్యే పనిలో పడింది. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు ఇలా ప్రతిదీ కల్తీ అవుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

కల్తీలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఒక బలమైన, కఠినమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రతిపాదిత 'తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం' (TGFADCA) పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు మరియు పండ్లు త్వరగా మగ్గేలా చేసేందుకు విచ్చలవిడిగా ప్రమాదకర రసాయనాలు వినియోగిస్తున్నారని, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగం వల్ల పంట ఉత్పత్తుల్లో ప్రమాదకర రసాయన అవశేషాలు బయటపడుతున్నాయన్నారు. ఈ కారణంగానే కొన్ని విదేశాలు మన దేశ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో సేంద్రియ (ఆర్గానిక్) ఉత్పత్తుల పేరుతో పలు రకాల వస్తువులను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ప్రజలు అధిక ధరలు చెల్లించి వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ, అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా..? కాదా….? అని నిర్ధారించేందుకు రాష్ట్రంలో సరైన శాస్త్రీయ వ్యవస్థలు లేకపోవడాన్ని ఆయన వేలెత్తి చూపారు. కొత్త చట్టంలో వీటన్నింటికీ పరిష్కారం చూపాలన్నారు.

అంతర్జాతీయ విధానాల అధ్యయనం

  • కల్తీల నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా సమగ్ర చట్టాలు విజయవంతంగా అమలులో ఉన్న దేశాలను సందర్శించి, అక్కడి విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
  • అధికారుల అధ్యయనాల ఆధారంగా ఒక సమగ్ర నివేదికను రూపొందించాలి.
  • ఈ నివేదిక ఆధారంగా ఒక బలమైన బిల్లును తయారు చేసి, శాసనసభలో దీనిపై సుదీర్ఘమైన, సమగ్రమైన చర్చ చేపడతామని స్పష్టం చేశారు.
  • చట్టం రూపకల్పనలో కేవలం ప్రభుత్వ నిర్ణయాలే కాకుండా, ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.

టోల్ ఫ్రీ నంబర్…

కల్తీలకు పాల్పడే కేటుగాళ్ల గుట్టు రట్టు చేసేందుకు సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు అత్యాధునిక 'విజిల్ బ్లోయర్' వ్యవస్థను, ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కల్తీల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతూనే, కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు.

ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ముందుగా 'క్యూర్' ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథమికంగా అక్కడ కఠిన నిబంధనలను అమలు చేసి…. ఆ సమయంలో ఎదురయ్యే లోటుపాట్లు, సాంకేతిక ఇబ్బందులను నిశితంగా పరిశీలించాలన్నారు. అక్కడ సాధించిన అనుభవాలు, ఫలితాల ఆధారంగా ఈ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తూ ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More