రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం… పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించండి - ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఎంపీలు పాల్గొన్నారు.
కేంద్రమంత్రులను కలవండి - సీఎం దిశానిర్దేశం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో హైదరాబాద్ ఉందని, ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPS ని కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని కోరారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని, ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలో కూడా ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.
మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు.
అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావలసి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. డ్యామ్తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని కేంద్ర మంత్రిని కోరామని, ఈ విషయంపై ఎంపీలు కేంద్ర మంత్రిని కలసి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్గఢ్ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. గోదావరిలో ఛత్తీస్గఢ్కు 300 టీఎంసీల వాటా ఉందని, వాటిని ఛత్తీస్గఢ్ వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు.
గోదావరి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు నీరు తీసుకెళ్లే గోదావరి-కావేరి అనుసంధానం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని, ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ విషయంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ ముఖ్యమంత్రి తో చర్చించామన్నారు. వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్వోసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అవుదామని ఎంపీలకు సూచించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఎలైన్మెంట్లు కొలిక్కివచ్చాయని సమావేశంలో వివరించారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎయిర్పోర్టుల్లో ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్), ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, ఈవిషయంపైనా ఎంపీలు దృష్టిసారించాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ను నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నాఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

