మూసీ నదిపై మూసారాంబాగ్లో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మూసీ నదిపై మూసారాంబాగ్లో నిర్మించిన కొత్త వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
తెలంగాణను ప్రణాళికాబద్ధంగా మూడు ప్రధాన రంగాలుగా వర్గీకరించి మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మూసీ నదిపై నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్ వంతెనను ప్రాంరంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

అంబర్పేట ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొద్దిపాటి వర్షానికే మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగేదని సీఎం గుర్తుచేశారు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తమ ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసిందని తెలిపారు.
గత ప్రభుత్వం నగరం బయట నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వల్ల ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే అంబర్పేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు, పలు ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.
కబ్జాలకు గురైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించామన్నారు. నాటి నుంచి నేటి వరకు బతుకమ్మ కుంటను కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని, వారి వెనుక ఉన్న శక్తులెవరో ప్రజలు గమనించాలని సూచించారు. సరస్సులు, చెరువులలోని అక్రమ నిర్మాణాలను తొలగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అంతే తప్ప తాము అక్కడ విల్లాలు, ఫామ్హౌస్లు నిర్మించడం లేదని హైడ్రా చర్యలను రేవంత్ రెడ్డి సమర్థించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గత 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.70 వేల కోట్లు అయితే, కేసీఆర్ ఒక్కరే తన తొమ్మిదేళ్ల పాలనలో దానిని రూ.8.11 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. జీతాల చెల్లింపుల్లో గత ప్రభుత్వంలో ఉన్న ఆలస్యాలకు స్వస్తి పలికి, తమ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ప్రతినెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని రూ.3,000 కోట్ల వ్యయంతో 2,000 పడకల సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిగా అధునీకరిస్తున్నామని, వచ్చే ఏడాదిలోనే దీనిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ టిమ్స్ ఆసుపత్రులకు ప్రసిద్ధ నాయకుల పేర్లను నిర్ణయించినట్లు తెలిపారు: సనత్నగర్ టిమ్స్ : మర్రి చెన్నారెడ్డి పేరు, అల్వాల్ టిమ్స్: టి. అంజయ్య పేరు, ఎల్బీనగర్ టిమ్స్: కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ టిమ్స్: ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టామన్నారు.
మరొకవైపు సామాజిక సమన్యాయం కోసం నిర్వహించిన కులగణనను ప్రశంసిస్తూ, బ్రిటిష్ హయాం నాటి 1931 తర్వాత ఈ స్థాయిలో దేశంలో మరే నాయకుడు సాహసించని విధంగా తెలంగాణలో జనాభా, కులగణన ప్రక్రియను చేపట్టామని తెలిపారు.
అసెంబ్లీకి గానీ, ప్రజల్లోకి గానీ రాకుండా ఉంటున్నారని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కలిగిన కేసీఆర్ రక్షణ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, నివాస సదుపాయాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.21 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రోజువారీ విధులకు హాజరుకాని ఏ ఉద్యోగైనా డిస్మిస్ అవుతారని, నిరంతరం ప్రజలకు దూరంగా ఉంటున్న కేసీఆర్ తన శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


