ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ నుండి స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం.

ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్లో ప్రసంగించాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ని సందర్శించారు. వారం రోజుల లీడర్ షిప్ కోర్సు పూర్తి చేశారు. అక్కడ నిర్వహించిన ఒక ప్రత్యేక సెషన్లో పాల్గొన్న ఆయన…. ప్రజా క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లు, క్షేత్రస్థాయి రాజకీయాలు, నిర్ణయాధికారంలో ఉండాల్సిన చొరవ వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఒక నాయకుడు అనుసరించాల్సిన వ్యూహాలు, పాలనలో టెక్నాలజీని జోడించడం వంటి అంశాలపై హార్వర్డ్ ప్రతినిధులతో తన అనుభవాలను రేవంత్ రెడ్డి పంచుకున్నారు.