మా టార్గెట్ అదే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రేవంత్ రెడ్డి స్పీచ్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తుందన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమ్మిట్లో ఒక ప్రత్యేక ఆకర్శణ ఇంటరాక్టివ్ రోబోట్, ఇది అతిథులను స్వాగతించడమే కాకుండా సమ్మిట్ లక్ష్యాలను కూడా వివరించింది. హాజరైన వారిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబోట్ పలకరించింది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక స్టాళ్లను పరిశీలించారు. సినీ నటుడు నాగార్జున ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు.
తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభోత్స కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగడం తమ ఆశయమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి మంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్టుగా వెల్లడించారు. కేంద్రం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. భారత జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ టార్గెట్ అని ప్రకటించారు సీఎం.
లక్ష్యం పెద్దది అయినప్పటికీ.. కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ సాకారమైందని చెప్పారు. దేశ జనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయం ఇస్తున్నామని అన్నారు. ఏ రాష్ట్రం చేయనట్టుగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని చెప్పారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లు అని పిలుచుకుంటున్నామన్నారు.
'చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ మాకు ఆదర్శం, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నాం. అది 20 సంవత్సరాలలోనే అత్యధిక పెట్టుబడులు సాధించింది. ఇక్కడ కూడా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ నమూనా అమలు చేయాలనుకుంటున్నాం.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
'తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టేందుకు, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అందుకే మీ అందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు. ఆ విజన్ సాధించగలం. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసం, నమ్మకంతో ఉన్నాను. నిన్నటిది ఒక కల, ప్రణాళిక.. ఇవాళ మీరంతా చేరారు. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని సాధించలగం. ఈ తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. కమ్ అండ్ జాయిన్ ది రైస్.'అని రేవంత్ రెడ్డి అన్నారు.














