తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత - 12 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు
తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో పూర్తిగా మంచు కప్పుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలి గాలుల తీవ్రతకు…. ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
తెలంగాణలో చలి తీవ్రత
ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం….ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(డిసెంబర్ 13) ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
డిసెంబర్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక హైదరాబాద్ లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఉత్తర ఈశాన్య దిశిలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 04 నుంచి 06 కిమీ ఉంటుందని పేర్కొంది.