కొండా సురేఖకు షాక్.. ఆర్అండ్‌బీకి మేడారం జాతర పనులు.. రికార్డులు అప్పగించాలని ఆదేశం

కాంగ్రెస్ పార్టీలో మరోసారి వివాదాలు రచ్చలేపుతున్నాయి. మేడారం జాతర పనులపై మంత్రుల మధ్య వివాదం నడుస్తోంది. తాజాగా ప్రభుత్వం మేడారం పనులను ఆర్అండ్‌బీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published on: Oct 16, 2025 11:55 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్ని రోజులుగా తెలంగాణలో మంత్రుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. మేడారం జాతర పనుల విషయంలో వివాదం జరుగుతునే ఉంది. తన శాఖలోకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం ఎక్కువైందని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చేసుకున్నారని మంత్రి సురేఖ ఇప్పటికే ఆరోపించారు.

కొండా సురేఖ
కొండా సురేఖ

ఈ వ్యవహారం కొనసాగుతుండగానే.. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం జాతర అభివృద్ధి పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. రికార్డులను వెంటనే అప్పగించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్త ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా వరంగల్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. మేడారం పనుల విషయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి, జిల్లాకు చెందిన మంత్రులు సురేఖ, సీతక్క మధ్య విబేధాలు వచ్చాయి. అయితే కొన్ని రోజులకు సీతక్క సైలెంట్ అయినట్టుగా కనిపించారు. కానీ కొండా సురేఖ Vs పొంగులేటి మధ్య వివాదం నడుస్తూనే ఉంది. తనకు తెలియకుండా టెండర్లు ఎలా కన్ఫామ్ చేస్తారని, పొంగులేటికి చెందిన కంపెనీకి పనులు ఎలా అప్పగిస్తారని ఆమె ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా మేడారం పనుల బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి ఆర్ అండ్ బీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ రచ్చ నడుస్తుండగానే.. జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో కొండా సురేఖ నివాసం వద్దకు బుధవారం రాత్రి నలుగురు పోలీసులు వెళ్లారు. ఓఎస్డీ సుమంత్ గురించి ఆరా తీశారు. సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా తెలుసుకున్న సురేఖ కుమార్తె సుస్మిత వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ఎందుకు వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? అని గట్టిగా అడిగారు.

సుమంత్‌ను విధుల నుంచి తప్పించిన తర్వాత ఆయన సురేఖ ఇంట్లోనే ఉన్నారని, ఆయనను పట్టుకునేందు పోలీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే కేసు వివరాలు చెప్పకుండా సుమంత్‌ను అప్పగించేది లేదని కొండా సుస్మిత ఖరాఖండీగా చెప్పేశారు.

అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా వచ్చింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా.. లేదంటే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని సుస్మిత ప్రశ్నించారు. కేసు వివరాలు చెప్పకుండా ఎందుకు వెతుకుతున్నారని మండిపడ్డారు. అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారని అడిగారు. తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలు చేశారు.

కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. డెక్కన్ సిమెంట్ కంపెనీకి విషయంలో ఎవరినో బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి.