వినియోగదారులకు న్యాయం చేయడంలో తెలంగాణ లాస్ట్.. ఆంధ్రప్రదేశ్ టాప్!

Consumer Justice Report 2026 ర్యాంకింగ్స్‌లో తెలంగాణలో చివరలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్టుగా నివేదిక వెల్లడించింది.

Updated on: Mar 19, 2026, 10:21:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల ఫిర్యాదులను ఎంత సమర్థవంతంగా పరిష్కరిస్తున్నారో అంచనా వేసే 'వినియోగదారుల న్యాయ నివేదిక 2026'లో 19 పెద్ద, మధ్యతరహా రాష్ట్రాల డేటాను విడుదల చేశారు. ఇందులో తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇండియా జస్టిస్ రిపోర్ట్ విడుదల చేసిన ఈ నివేదిక, వినియోగదారుల కమిషన్లను మౌలిక సదుపాయాలు, సిబ్బంది, బడ్జెట్లు, పనిభారం, వైవిధ్యం వంటి అంశాల ఆధారంగా అంచనా వేసింది. వీటితో వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ల పనితీరును కొలుస్తుంది. కోటికి పైగా జనాభా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

ఈ పరిశోధనల ఫలితాలు తెలంగాణ వినియోగదారుల సమస్యల పరిష్కార యంత్రాంగంపై ఆందోళనకరమైన అంశాన్ని తెలిపాయి. 2025 నాటికి, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (SCDRC) అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. జిల్లా స్థాయిలో, ప్రతి నాలుగు పోస్టులలో ఒకటి భర్తీ చేయలేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలోని 33 జిల్లాలలో, ప్రస్తుతం కేవలం 12 జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు (DCDRC) మాత్రమే పనిచేస్తున్నాయి.

దాఖలైన కేసులలో గృహ వివాదాలు 25 శాతంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆ తర్వాత బీమా 21 శాతం, వ్యవసాయం 15 శాతంతో ఉన్నాయి. కేసుల పరిష్కారంలో జాప్యం అనేది అత్యంత తీవ్రమైన అంశంగా ఉంది. సగటున ఒక కేసును పరిష్కరించడానికి దాదాపు 1,000 రోజులు పడుతోంది. ఇది నిర్దేశించిన కాలపరిమితి కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నది.

2010 నుండి 2024 మధ్య జాతీయ వినియోగదారుల కేసుల నిర్వహణ వ్యవస్థ నుండి సేకరించిన డేటా ప్రకారం, తెలంగాణలో సుమారు 11,700 కేసులు దాఖలయ్యాయి. వీటిలో 66 శాతం మొదటి అప్పీళ్లు, అంటే కమిషన్ తీర్పుతో అసంతృప్తి చెందిన పక్షం దానిని ఉన్నత స్థాయిలో సవాలు చేసిన కేసులు.

రాష్ట్ర కమిషన్‌లో దాఖలైన కేసులలో 74 శాతం కేసుల పరిష్కారానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. అంటే ఒక్కో కేసుకు సగటున 974 రోజులు పట్టింది. జిల్లా కమిషన్ స్థాయిలో, 61 శాతం కేసులు ఏడాది దాటాయి. వాటిలో 44 శాతం కేసులకు 20కి పైగా విచారణలు అవసరమయ్యాయి. అంటే తుది ఉత్తర్వు కోసం సుమారుగా రెండేళ్ల నిరీక్షణ జరిగిందన్నమాట.

2020 నుండి 2024 మధ్య కాలంలోని గణాంకాలు 100 శాతం కేసుల పరిష్కార రేటును చూపిస్తున్నాయి. దీనిని బట్టి న్యాయం నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ.. అది కనీసం చేరుతోందని భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెుత్తానికి కేసుల పరిష్కారంలో జాప్యాన్ని కూడా ఈ నివేదిక ఎత్తి చూపింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More