ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు..?సింగరేణి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
సింగరేణిపై కట్టు కథలు విషపు రాతలు రాస్తున్నారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మేలు కోసము ఈ కథనాలు రాశారో తేలాలంటూ కామెంట్స్ చేశారు. , సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా పనిచేస్తున్న నాపై ఇలాంటి దుష్ప్రచారాలకు తావులేదన్నారు.
తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు అల్లుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన… కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండివారుస్తున్నారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

“ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.
సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనలు ఉన్నాయని భట్టి చెప్పారు. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాసిన కథనాలు తప్పు అని ప్రజలకు తెలియజేయయాలని సూచించారు.
“2021లో సెంట్రల్ మైనింగ్ కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని చెప్పింది. టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి అని NMDC కూడా చెప్పింది”అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.
“నేను ఎలాంటి చిల్లర పనుల కోసం రాలేదు. నాకున్న ఉన్నతమైన ఆలోచనల్ని అమలు చేయాలనేదే నా లక్ష్యం. నిజానిజాలు బయటకు రావాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అడ్డగోలు ప్రచారం చేసే వారి అసలు రూపం బయటపడాలి..పత్రికలు, నాయకులే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు కూడా ఇస్తాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఏ గద్దను వాలనీయను - భట్టి
అడ్డగోలుగా ఏదిపడితే అది రాస్తే నడవదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. “నేను ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదు.. సమాజంలో మార్పు కోసం వచ్చా. నా పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి కోసం పోరాడా.. సింగరేణిపై ఏ గద్దని, ఏ పెద్దలను వాలనీయను. బొగ్గు బావులు తెలంగాణకు ఎంత అవసరమో నాకు తెలుసు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. “హరీష్రావు లేఖ రాయాలనుకుంటే నాకు రాయండి. వాళ్లకు, వీళ్లకు లేఖ రాసి ఎందుకు ఇబ్బంది పెడతావ్. ఆ లేఖ ఏదో నాకే రాస్తే.. నేనే విచారణకు ఆదేశిస్తా కదా..?” అంటూ భట్టి మాట్లాడారు.

E-Paper












